ఒక్కరొక్కరు దూరం: కిరణ్ మద్దతు కోల్పోతున్నారా
తాజాగా మరో ఇద్దరు ముఖ్యమంత్రి మద్దతుదారులు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాద రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో రోడ్లు, భవనాల శాఖ ఖాళీగా ఉంది. ఆ బాధ్యతలను కిరణ్ మంత్రి పితాని సత్యనారాయణకు అప్పగించారు.
ఈ శాఖను తనకు ఇస్తానని మంత్రి శైలజానాథ్కు కిరణ్ హామీ ఇచ్చారట. అయితే పితానికి దానిని ఇవ్వడంతో శైలజానాథ్ అసంతృప్తితో ఉన్నారట. శైలజానాథ్ ముఖ్యమంత్రి మద్దతుదారుల్లో ముందుంటారు. కానీ ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు పాడి పరిశ్రమ శాఖను మరో మంత్రి తోట నర్సింహంకు అప్పగించారు.
ముఖ్యమంత్రికి గట్టి మద్దతుదారు అయిన బాలరాజు కూడా ఆయనకు దూరం జరుగుతున్నారట. గంటా శ్రీనివాస రావుకు ప్రాధాన్యత ఇస్తుండటం బాలరాజుకు మింగుడుపడటం లేదంటున్నారు. 2009 ఎన్నికల్లో గంటా ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు.
అనంతరం చిరంజీవి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేశారు. విస్తరణలో గంటాకు మంత్రి పదవి వచ్చింది. మొదటి నుండి మద్దతుగా నిలబడిన తమలాంటి వారికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలరాజు వర్గం ఆవేదన చెందుతోందట.
విభజన నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రుల మద్దతును కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డి క్రమంగా సీమాంధ్ర మంత్రుల మద్దతు కూడా కోల్పోతున్నారంటున్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతుండటంతో మంత్రి కొండ్రు మురళి కూడా దూరంగా ఉంటున్నారని అంటున్నారు. కొండ్రు మురళీ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేస్థాయిలో కాంగ్రెసు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.