ఉదయం డైలీ భూమి వెనక్కి: ఆంధ్రజ్యోతిది మరో కథ
హైదరాబాద్: మూతపడిన దినపత్రికలకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికలకు భూములు కేటాయించారు. వాటిలో మూతపడిన పత్రికల భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంస్థలు 1994 నుంచి తమకు కేటాయించిన భూములను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ భూములను ఎందుకు వెనక్కు తీసుకోకూడదో తెలియజేయాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్లు జారీచేసింది. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
1994 నాటికే మూతపడిన ఉదయం, ఆంధ్ర పత్రిక, ది గార్డియన్ దిన పత్రికలకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలోగల హుడా లేఅవుట్లో భూములు కేటాయించారు. ఒక్కో పత్రికకు రెండు ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే అంధ్రజ్యోతి దిన పత్రిక పాత యాజమాన్యం డాట్ పబ్లిషర్స్కు కూడా అదే ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం కేటాయించింది.
బాలాజీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉదయం పత్రిక యజమాన్యం జూబ్లీహిల్స్లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకుంది. ఈ పత్రిక 1995లో మూత పడింది. నాటి నుంచి పత్రికను తిరిగి ప్రారంభించే ప్రయత్నం కూడా చేయలేదు. పత్రికను నడుపుతామని ఎప్పటికప్పుడు యాజమాన్యం నమ్మబలుకుతూ వచ్చింది. కానీ, పత్రికను నడిపేందుకు కనీసం లైసెన్స్లు కూడా తీసుకోలేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది.
దానికితోడు బాలాజీ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సంస్థ పత్రికా నిర్వహణను వదిలేసి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ప్రజా ప్రయోజనాలు నెరవేరడంలేదని భావించిన ప్రభుత్వం, ఆ సంస్థకు ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
దిన పత్రికలు మూతపడిన 10 ఏళ్లకు ఆ పత్రికలకు భూములను గత ప్రభుత్వం కేటాయిచింది. 1984లో మూతపడిన ఆంధ్ర పత్రిక, ది గార్డియన్ దిన పత్రికలకు 1994లో భూములు కేటాయించడం విశేషం. ఆంధ్ర పత్రిక మూత పడిన పదేండ్లకు ఆ పత్రిక యజమాన్యం మహర్షి పబ్లిషర్స్ సంస్థ దిన పత్రికను నడపడానికి భూమి కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దానికి కూడా భూమి కేటాయించారు.
అలాగే 1984లోనే మూతపడిన ఇంగ్లిష్ దినపత్రిక ద గార్డియన్కు చెందిన క్రియేటివ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మరో రెండు ఎకరాల భూమి కేటాయించారు. ఈ రెండు దిన పత్రికలు మూతపడి ఇప్పటికి 30 ఏళ్లు దాటింది. అయినా, ఇప్పటికీ తాము పత్రికలు నడుపుతామంటూ ఆయా యాజమాన్యాలు తెల్లకాగితంపై ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటాయి. వీరి తీరుపై విసుగెత్తిన రాష్ట్ర ప్రభుత్వం, భూములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
ఆంధ్రజ్యోతి దిన పత్రికది మరో కథ. ఆంధ్రజ్యోతి దినపత్రిక యజమానులు మారారు. ప్రచురణ సంస్థలు వేరు. ఆంధ్రజ్యోతి దిన పత్రికను నడుపుతానని ప్రభుత్వం నుంచి 1994లో డాట్ పబ్లిషర్స్ సంస్థ జూబ్లీహిల్స్లో రెండు ఎకరాల భూమిని తీసుకుంది. ఈ సంస్థ యజమాని కే జగదీశ్ ప్రసాద్. ఆయన 1994లో భూమిని తీసుకున్నా పత్రిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు.
ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే 2000లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను మూసేశారు. ఏడాదిన్నరపాటు పత్రిక మార్కెట్లోకి రాలేదు. తిరిగి 2002లో ఆంధ్రజ్యోతి పత్రికను ఆమోద పబ్లికేషన్స్ సంస్థ ద్వారా వేమూరి రాధాకృష్ణ కొనుగోలు చేసి మళ్లీ ప్రారంభించారు.
నాటి నుంచి నేటి వరకు ఈ కొత్త యాజమాన్యం నిర్వహణలోనే పత్రిక నడుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మాత్రం డాట్ పబ్లిషర్స్ వద్దే ఉండిపోయింది. ఈ భూమిని తీసుకున్న డాట్ పబ్లిషర్స్ సంస్థ యజమాని జగదీశ్ ప్రసాద్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. దీంతో భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.