నంద్యాల గేమ్: టర్నింగ్ పాయింట్ ఇదే?.. ఓటరు నాడి పట్టేదెవరో!
ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఓటు మేనేజ్మెంట్ను పార్టీలు స్పీడప్ చేశాయి.
కర్నూలు: ప్రచార హోరు చివరి అంకానికి చేరుకుంది. ఇంకా మూడు రోజులు మాత్రమే ఇందుకు సమయం ఉండటంతో.. అంతర్గతంగా ఓటు మేనేజ్మెంట్ ను పార్టీలు స్పీడప్ చేశాయి. నంద్యాల ఓటరు నాడిని పట్టుకునేందుకు ఒకరిని మించి ఒకరు మేనేజ్మెంట్ తిప్పలు పడుతున్నారు.
రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!
అధికారుల సోదాలు, నేతల వద్ద దొరుకుతున్న డబ్బుతో.. ఉపఎన్నికలో ధన ప్రవాహం జోరుగా సాగుతున్నట్లే కనిపిస్తోంది. ప్రచారాల కంటే ప్రలోభాలను నమ్ముకున్నాయి కాబట్టే పార్టీలు ఈ ఎత్తుగడకు తెరలేపాయని చెప్పవచ్చు. ఇందులోను మీరంటే మీరే డబ్బు పంపిణీ చేశారని దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
టర్నింగ్ పాయింట్:
అటు వైసీపీకి, ఇటు టీడీపీకి గెలుపుపై ఉన్న ధీమా కన్నా ఓటమి పట్ల ఉన్న భయంతోనే ఈ భారీ ప్రలోభాలు మొదలయ్యాయన్న విమర్శలున్నాయి. అగస్టు 23నాడు జరిగే ఎన్నికను ప్రభావితం చేయాలంటే చివరి మూడు రోజులే టర్నింగ్ పాయింట్ కావడంతో.. ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవాలనే రీతిలో ఇరు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరు పక్షాలు ఒకరి కదలికలపై మరొకరు నిఘా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీపై టీడీపీ గట్టి నిఘా:
వైసీపీ కదలికలపై టీడీపీ గట్టి నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారన్న ఆరోపణలున్నాయి. డబ్బు పంపిణీ జరగకుండా చూసేందుకు టీడీపీ శ్రేణులు వైసీపీని అడుగడునా వెంబడిస్తున్నాయని తెలుస్తోంది. ఇటు వైసీపీ నేతల ఇళ్లపై పోలీసుల సోదాలు ఎక్కువవడం కూడా ఇందులో భాగంగానే కనిపిస్తోంది.
ఉక్కిరిబిక్కిరి చేయడానికేనా?:
ప్రచార పర్వంలో చివరి మూడు రోజులు ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నేతలు నంద్యాలలో ఈ పనిని నిర్వర్తిస్తుండగా.. పై స్థాయి నేతలంతా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. తన సహకార సంస్థ ద్వారా శిల్పా మోహన్ రెడ్డి పరోక్షంగా డబ్బు పంచుతున్నారని, ఇందుకోసం కొన్ని స్లిప్పులను ప్రజలకు ఇస్తున్నారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
తిప్పికొడుతోన్న వైసీపీ:
డబ్బు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ వైసీపీపై సాగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ తిప్పికొడుతోంది. ప్యాంట్రీ వాహనం ద్వారా భారీ మొత్తంలో డబ్బు తరలింపుకు యత్నించారని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో ఇరు పక్షాలు మీరంటే.. మీరు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ వాదించడం మొదలైంది.
ఇదంతా గమనిస్తున్న జనం మాత్రం పొలిటికల్ గేమ్ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. చివరి మూడు రోజులు ఇది పీక్స్కు చేరడంతో.. వారిపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం. మొత్తం మీద నంద్యాల ఓటరు మదిలో ఎవరి ముద్ర బలంగా పడుతుందో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.