వ్యూహం మార్చిన కిరణ్: 9 ప్రశ్నలు సంధించారు
తెలంగాణ ముసాయిదా బిల్లు అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం మార్చనున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు బిల్లు పైన అసెంబ్లీ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. బిల్లు పైన పొడిగింపు కోరితే రాష్ట్రపతి ఈ నెలాఖరు వరకు ఇవ్వవచ్చునని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని వెనుక సీమాంధ్ర నేతలు ఉన్నారని తెలంగాణ ప్రాంత నేతలు రెండు రోజుల క్రితమే ఆరోపించారు.
ఈ నెలాఖరు వరకే కాకుండా మరికొద్ది రోజుల పొడిగింపు కోసం కిరణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేల నుండి పొడిగింపు కోరుతూ లేఖలు తీసుకొని వాటిని రాష్ట్రపతికి పంపించాలనే ఆలోచనలో ఉన్నారట. సాధ్యమైనంత మేర పొడిగించాలనేది కిరణ్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

మరోవైపు విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ గడువును మరో నాలుగు వారాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి కేంద్రం హోంశాఖకు లేఖ రాశారట. ఈ విషయాన్ని శనివారం హోంశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు 23తో ముగుస్తున్న తరుణంలో మహంతి లేఖ రాశారు. ఈ లేఖను హోంశాఖ సోమవారం రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. దానిపై రాష్ట్రపతి మంగళ, బుధవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరినప్పటికి రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంకోవైపు.. బిల్లుకు సంబంధించి సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిల్లుపై తమకు ఉన్న అనుమానాలు, అపోహలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలంటూ స్పీకర్ మనోహర్కు లేఖలు అందించారు.
1) బిల్లుపై న్యాయ, ఆర్థిక, నీటి పారుదల వంటి కీలక శాఖల సూచనలు ఏమిటీ? 2) 371-డి, ఉమ్మడి రాజధానిపై అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటీ? 3) గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడంపై అటార్నీ జనరల్ అభిప్రాయం కావాలి. 4) బిల్లుకు సంబంధించి కేబినెట్ను మంత్రి మండలి ముందు ఏ నిబంధన ప్రకారం పెట్టారు? 5) సీమాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటైన ఆంటోని కమిటీ నివేదిక ఏమైంది? 6) ఉమ్మడి రాజధాని విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన అభిప్రాయం ఏమిటీ?
7) భద్రాచలం డివిజన్ను తెలంగాణలో కలపడంలో హోంశాఖ సూచించిన సహేతుకత ఏమిటీ? 8ఎ) పధ్నాలుగేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ విద్యుత్కేంద్రాల్లో ఎవరికీ కేటాయించని విద్యుత్తు పరిస్థితి ఏమిటీ? 8బి) క్యాప్టివ్ పవర్ స్టేషన్ల నుంచి వచ్చే విద్యుత్తును రాష్ట్రాలకు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరమా? 9) నీటి అంశాలపై పూర్తి అధికారం రాష్ట్రానిదే అయినప్పుడు దీనిపై కేంద్రం పెత్తనం చెలాయిస్తామనడం ఎంతవరకు రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుంది?
సీమాంధ్ర ఎమ్మెల్యేలు కేంద్రాన్ని అడిగిన ప్రశ్నల లేఖలను స్పీకర్ మనోహర్ తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందజేశారు. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యత్నిస్తున్నారని తెలంగాణ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications