సూర్యాపేట కాల్పులతో సరూర్నగర్ కాల్పులకు లింక్?
హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట కాల్పులకు సరూర్నగర్లో జరిగిన హత్యాయత్నానికి సంబంధం ఉందా అనే కోణంలో ఆలోచనలు సాగుతున్నాయి. హైదరాబాదులోని సరూర్నగర్ ప్రాంతంలో జ్యోతిష్కుడు నాగరాజుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఓ కేసులో నిందితుడైన నాగరాజుపై ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అతను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడు.
కాగా, ఆ సంఘటనతో సూర్యాపేట కాల్పులకు సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సూర్యాపేటలో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, సిఐతో పాటు హోంగార్డ్ తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేటలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
దుండగులు రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి గుడివాడకు బయలుదేరిన బస్సులో ప్రయాణించారని అనుమానిస్తున్నారు. అయితే, బస్సు డ్రైవర్లు మాత్రం దుండగులు తమ బస్సులోనే ప్రయాణించారని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు లేవని ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవితో అన్నారు. బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు తాండూరులో బయలుదేరి హైదరాబాద్ వచ్చింది.
డ్రైవర్లు ఎన్టీవితో చెప్పిన వివరాల ప్రకారం - హైదరాబాదులోని బస్సు డిపోలో కొంత మంది బస్సు ఎక్కారు. చాదర్ఘాట్ వద్ద మాత్రం ఇద్దరు వ్యక్తులు బస్సు ఎక్కారు. డ్రైవర్లు సూర్యాపేటలో టిఫిన్ చేయడానికి ఆపారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను సూర్యాపేటలో కాసేపు ఆపి టిఫిన్ చేయడం పరిపాటి. అదే రీతిలో బస్సు డ్రైవర్లు టిఫిన్ చేయడానికి వెళ్లారు.
తిరిగి వచ్చి బస్సును తీసినప్పుడు మాత్రం ఇద్దరు ప్రయాణికులు తగ్గినట్లు డ్రైవర్లు గమనించారు. వారిద్దరు ఎవరనేది వారికి అంతుబట్టలేదు. వారి కోసం గాలించారు. కానీ ఫలితం కనిపించలేదు. దీంతో ఇద్దరు ప్రయాణికులను వదిలేసి డ్రైవర్లు బస్సును తీసుకుని వెళ్లిపోయారు. అయితే, తాము వెళ్లిపోయిన తర్వాత సూర్యాపేటలో ఏం జరిగిందనేది వారికి తెలియదు. బుధవారం మధ్యాహ్నం పోలీసు ఉన్నతాధికారులు ఫోన్లు చేయడంతో వారికి తెలిసింది.
బస్సులో ప్రయాణించిన ఆ ఇద్దరే సూర్యాపేట కాల్పులకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.