జెపికి నిరాశ: కేజ్రీవాల్తో కుదరని స్నేహం
హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తాకు మధ్య స్నేహం కుదరలేదు. కేజ్రీవాల్ లోకసత్తా విలీనాన్ని కోరగా, జయప్రకాష్ నారాయణ పొత్తును ఆకాంక్షించారు. దీంతో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉండే అవకాశాలు లేవు. దానికితోడు, రాష్ట్రంలో పార్టీకి ప్రజలను సమీకరించుకునే పనిలో ఆమ్ ఆద్మీ పార్టీ పడింది.
రాష్ట్రంలో ఒంటిరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జయప్రకాష్ నారాయణ శుక్రవారం చెప్పారు. పొత్తుకు కేజ్రీవాల్ అంగీకరించకపోవడంతో జయప్రకాష్ నారాయణకు నిరాశే మిగిలింది. దాంతో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
రాష్ట్రంలోని మొత్తం 294 శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన జెపి 25 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఎన్నికల పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ప్రశాంత్ భూషణ్ కూడా చెప్పారు. జయప్రకాష్ నారాయణతో పాటు లోకసత్తాకు చెందిన బెంగళూర్, ముంబై, ఢిల్లీ నాయకులు ఇటీవల కేజ్రీవాల్తో పొత్తు కోసం చర్చలు జరిపారు. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి.
రాష్ట్రంలో మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, మిగతా రాష్ట్రాలకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని జెపి చెప్పారు. ఇప్పటికిప్పుడైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీతోనూ పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.