దటీజ్ మోడీ, పాక్కు ఇలాగే బుద్ధి చెప్పాలి: కట్జూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్స ప్రసంగం పైన ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్ పైన పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. ప్రధాని ఈ రోజు (సోమవారం) ఎర్రకోట నుంచి ఆసక్తిక ప్రసంగం చేశారు. దీనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు మాట్లాడుతూ.. బెలూచిస్తాన్ గురించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీరులో ఉగ్రవాదాన్ని, ఆందోళనలను నిరంతరం రెచ్చగొడుతున్న పాక్కు మన ప్రభుత్వం అదే రీతిలో ఎందుకు గుణపాఠం చెప్పకూడదని ప్రశ్నించారు.
సింధ్, బెలూచిస్తాన్, ఎన్డబ్ల్యూఎఫ్పీలలో మనం కూడా అదేవిధంగా చేయాలన్నారు. ఈ సందర్భంగా కట్జూ.. జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, కన్నయ్య కుమార్ తదితర విద్యార్థులకు సవాల్ చేశారు. బెలూచిస్తాన్, సింధ్, ఎన్డబ్ల్యూఎఫ్పీలకు స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేసి చూడాలని సవాల్ చేశారు. పాకిస్తాన్తో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించాలన్నారు.
ప్రధాని మోడీ ఎర్ర కోట నుంచి మాట్లాడుతూ.. తాము ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. స్వాతంత్ర్యం కోసం బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు పాక్ ప్రధాని షరీఫ్.. జమ్ము కాశ్మీర్లో స్వతంత్ర కాశ్మీర్ డిమాండుకు మద్దతు ప్రకటించారు. మోడీ కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని మోడీ
భారతీయులు మానవత్వానికి మారుపేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ ప్రజలు మానవత్వాన్ని చాటి చెప్పారన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ
పాకిస్థాన్లోని పెషావర్ స్కూల్లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఎంతో మంది అమాయకపు చిన్నారులు బలయ్యారని, ఆ విద్యాలయం రక్తసిక్తమైందని, ఆ ఘటనను చూసి యావత్ భారతం చలించిందన్నారు. భారత పార్లమెంట్ సహా మన దేశంలోని ప్రతి పాఠశాల కన్నీరు కార్చిందని, ప్రతి విద్యార్థి బాధపడ్డాడన్నారు. భారతీయుల మానవత్వం అంటే అది అన్నారు.
ప్రధాని మోడీ
కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులను కీర్తిస్తున్నారని, భారత్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే అక్కడ వేడుకలు చేసుకుంటున్నారని. అలాంటి వారిని, ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇదే వారికి మనకున్న తేడా అన్నారు. ప్రపంచ దేశాలు ఈ బేధాలను అర్థం చేసుకుంటాయన్నారు.
ప్రధాని మోడీ
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజల గురించి మోదీ ప్రస్తావించారు. ఈ స్వతంత్య్ర దినోత్సవం నాడు నేను కొందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ మోడీ తెలిపారు. బలోచిస్థాన్, గిల్గిత్, బల్తిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు తనపై ఎంతగానో ప్రేమ చూపుతున్నారని.. తాను వారి దగ్గర లేకపోయినా.. వారిని కలిసే అవకాశం లేకున్నా.. అక్కడి ప్రజలు మాత్రం తనపై ప్రేమ, గౌరవాన్ని చూపుతున్నారని మోడీఅన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. వారికి మద్దతు అన్నారు.