హైదరాబాద్లో న్యూయార్క్ తరహా... సూపర్ కాప్
తెలంగాణ నయా పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. హైదరాబాదులో న్యూయార్క్ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీసింగ్ వ్యవస్థపై తెరాస ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఖాకీ దుస్తులకు వీడ్కోలు పలకనున్నారు. 1650 కొత్త ఇన్నోవాలు, 1500 మోటార్ సైకిళ్లు ఇవ్వనున్నారు. పది నిమిషాల్లో నేరస్థలికి పోలీసులు చేరుకునేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సంపూర్ణ భద్ర, గల్లీగల్లీలో నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు సిద్ధమైంది. రాజధానికి అంతర్జాతీయ స్థాయి భద్రతను ఉండనుంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా హైదరాబాదును మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోలీసులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంది. ఐరాస దళాల తరహా యూనిఫాం ఉండనుంది. కమిషనరేట్ అంతర్జాతీయ స్థాయిలో ఉండనుంది. నగరంలోని క్యాబులన్నింటీకి ఒకే రంగు ఉండనుంది. పోలీసులకు వారంతపు సెలవులు ఇవ్వనున్నారు.
నగరంలో భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు, పోలీసు వ్యవస్థలో మార్పులు, కొత్త డ్రెస్ కోడ్ తదితర అంశాలపై చర్చించేందుకు కెసిఆర్ శనివారం సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్రెడ్డి, సివి ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో, పోలీసు వ్యవస్థకు సంబంధించి పలు కీలక మార్పులపై చర్చించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసు యూనిఫామ్ను మార్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా దళాల మాదిరిగా లైట్ బ్లూ కలర్ షర్టు, డార్క్ బ్లూ కలర్ ఫ్యాంటును కొత్త యూనిఫామ్ కోడ్గా నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో న్యూయార్క్ తరహా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేరం జరిగితే పది నిమిషాల్లో పోలీసులు అక్కడ ప్రత్యక్షమయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు.
ఐటి హబ్గా హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కెసిఆర్ ఆదేశించారు. పోలీసు పెట్రోలింగ్ వాహనాలన్నింటికీ ఒకే రంగు ఉండాలని నిర్ణయించారు. నగరంలో ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన కూడళ్లలో మాత్రమే సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇకపై నగరంలో అడుగడుగునా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలని నిర్ణయించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేవిధంగా భద్రతా చర్యలు ఉండాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం నాయిని వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. మహిళ రక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్లో రెండు కమిషనరేట్లు ఏర్పాటు చేసి వాటిని పటిష్టపరుస్తామన్నారు.
హైటెక్ సిటీని, ఆ ప్రాంతంలోని ఐటి కంపెనీల భద్రత, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్లో అంతర్జాతీయస్థాయిలో కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నేరం జరిగిన క్షణాల్లోనే పోలీసులు స్పందించే విధంగా ఏర్పాట్లు ఉంటాయని హోంమంత్రి నాయిని భరోసా ఇచ్చారు. రూ.300 కోట్లతో ఆధునిక హంగులతో పాటు వాహనాల కొనుగోలు, ఇతర సౌకర్యాలకు అనుమతించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ అంకితం కావలని, పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని కెసిఆర్ చెప్పారు.