జగన్కు ఝలక్: దోస్తీలో ట్వీస్ట్, చంద్రబాబు వైపే మోడీ
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సంబంధాలపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. దాంతో వారిద్దరి మధ్య తిరిగి బంధం బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుతో కలిసి నడిచేందుకే మోడీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్టీఎ అభ్యర్థి రామనాథ్ కోవిందుకు బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదని అంటున్నారు.
మోడీతో జగన్ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, చంద్రబాబుకు బిజెపి దూరమై జగన్తో దోస్తీ కట్టే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ, తాజా పరిణామం అందుకు విరుద్దమైన సంకేతాలను పంపింది.
రాష్ట్రపతి ఎన్నికే...
రాష్టప్రతి ఎన్నిక చంద్రబాబు, మోడీ మధ్య బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పించింది. రాష్టప్రతి అభ్యర్థిగా రామనాధ్ కోవింద్ ఎంపిక విషయాన్ని కూడా ప్రధాని తొలుత చంద్రబాబుకే ఫోన్ చేసి చెప్పారు. దానికితోడు ఆయనను బలపరిచేందుకు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు చాలామంది ఉన్నప్పటికీ, వారిని పక్కకుపెట్టి తన తర్వాత పేరు ప్రతిపాదించేందుకు మోడీ చంద్రబాబునే ఎంచుకున్నారు.
అమిత్ షా వచ్చినప్పుడు...
ఇటీవల అమిత్షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలసి గన్నవరం వరకూ చంద్రబాబు ప్రయాణించారు. రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవం చేసే బాధ్యత తీసుకోవాలని, అందులో భాగంగా ఎక్కువమంది ఎంపీలున్న తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మద్దతు కూడగట్టే బాధ్యతను తీసుకోవాలని అమిత్షా ఆ సమయంలో చంద్రబాబుకు సూచించారు.
ఆ బాధ్యత చంద్రబాబుకు...
రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత నరేంద్ర మోడీ చంద్రబాబుకు ఫోన్ చేసి, మమతా బెనర్జీతో చర్చించి ఆమెను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు, దాంతో చంద్రబాబు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీతో మాట్లాడే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. మోడీకి చంద్రబాబు ఫోన్ చేయగా, తమ అభ్యర్థిని బలపరచాలని కోరడానికి అమిత్ షా జగన్కు ఫోన్ చేశారు.
వెంకయ్య నాయుడు ఇలా...
రాష్ట్ర స్థాయిలో వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వంటి నేతలు తెలుగుదేశం పార్టీ-ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. చంద్రబాబును అన్ని విధాలుగా బలపరుస్తున్నారు. ఎంపి హరిబాబు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. చంద్రబాబుతో బిజెపి సంబంధాలు చెడిపోకుండా ఎప్పటికప్పుడు వెంకయ్య నాయుడు సరిచేసుకుంటూ వస్తున్నారనే అభిప్రాయం ఉంది.
పురంధేశ్వరి, సోము వీర్రాజు....
సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావువంటి నేతలు టిడిపి పార్టీ-ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు ఇటీవలే విశాఖ భూములపై ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఏ సమయంలో ఎటు ఉంటారో ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి-బిజెపి శ్రేణుల మధ్య దూరం ఉంది. ఆ విషయాన్ని సోము-కన్నా పలు సందర్భాల్లో వెల్లడించారు.
సుజనా చౌదరి ప్రధాన పాత్ర...
కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం ఢిల్లీ లోని బిజెపి అగ్రనేతలు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అరుణ్జైట్లీ, రాజ్నాథ్సింగ్, సిద్ధార్థనాథ్సింగ్, ప్రకాష్ జవదేకర్, ప్రభు వంటి ప్రముఖులతో ఆయన నిరంతరం సంబంధాలను నెరుపుతున్నారు. ఆ రకంగా బిజెపికి, టిడిపికి మద్య పరిస్థితులు చెడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. దానివల్ల రాష్ట్ర స్థాయిలో బిజెపికి చెందిన ఒక వర్గం చంద్రబాబుపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా, వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు
ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎన్ని కేంద్రపథకాలు అమలు చేసినా ఎప్పుడూ మోడీ ఫొటోను పెట్టలేదు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, దానివల్ల తమ పార్టీకి ప్రయోజనం కలగడం లేదని బిజెపికి చెందిన ఓ వర్గం తరచూ తమ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన గృహనిర్మాణ పథక శంకుస్థాపన కార్యక్రమంలో తొలిసారిగా మోడీ ఫొటో కూడా పెట్టారు. తద్వారా బిజెపి శ్రేణులు తనపై ఫిర్యాదులు చేయకుండా జాగ్రత్తపడ్డారు.
జగన్ లోపం అదే....
బిజెపితో తెలుగుదేశం బందాన్ని తెంపేసి, తాను దగ్గర కావడానికి ప్రయత్నాలు చేసేందుకు అవసరమైన యంత్రాంగం జగన్కు లేదు. దానికితోడు, చంద్రబాబు కోసం నిరంతరం పనిచేస్తున్న వెంకయ్య నాయుడు, సుజనా చౌదరివంటి వారి ఎత్తుగడలను తిప్పికొట్టే వ్యవస్థ కూడా ఆయనకు లేదు. అంతా తానై చూసుకోవాల్సి రావడం కూడా జగన్కు మైనస్ పాయింటే