రిజర్వేషన్ల పెంపు: తమిళనాడు తరహా సాధ్యమా?, కేంద్రం చేతిలోనే అంతా?
తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంపు అంశానికి సంబంధించి కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
హైద్రాబాద్: తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంపు అంశానికి సంబంధించి కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎస్ టి లకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్రం సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నా, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్రం వ్యతిరేకత తెలిపే అవకాశం లేకపోలేదు.
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముస్లింలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 4 శాతం నుండి 12 శాతానికి మార్చేందుకు రంగం సిద్దం చేసింది.మరో వైపు ఎస్ టీ లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 12 శాతానికి పెంచనున్నారు. మరో వైపు బిసిల రిజర్వేషన్ ను 33 శాతానికి పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
ఈ మేరకు రిజర్వేషన్ల ముసాయిదాకు శనివారం నాడు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.అంతేకాదు ఈ బిల్లులకు చట్ట రూపం తెచ్చేందుకుగాను ఏప్రిల్ 16వ, తేది నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.మత ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలకు బిజెపి శ్రీకారం చుట్టింది.
కేంద్రం నిర్ణయమే కీలకం
ముస్లింలకు, ఎస్ టీ లకు, బిసిలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి చట్టం చేశాక కేంద్రమే నిర్ణయమే కీలకంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.దీనికి రాష్ట్రపతికి పంపాలనీ, ఆ తర్వాత ఇది చట్టమయ్యాక దాన్ని 9వ, షెడ్యూల్ లో చేర్చడానికి రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించి, అది పార్లమెంట్ ఆమోదం పొందేలా చూడాలని రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించి అది పార్లమెంట్ ఆమోదం పొందాలి.పార్లమెంట్ ఆమోదం పొందితేనే ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఉండదు.
రిజర్వేషన్ బిల్లుకు 9వ,షెడ్యూల్ కు సంబంధం ఏమిటీ?
ఏదైనా చట్టాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం లేకుండా భారత రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టడం 66 ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ తీసుకొన్న నిర్ణయం ఈ 9,వ షెడ్యూల్ లో పెట్టాలంటే కేంద్రం అనుమతించాల్సిందే.
తమిళనాడులో ఏం చేశారు?
1993 నవంబర్ లో ఓ కోటా కేసులో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చాక జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకె ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో బిసిలు, ఎస్ సి లు, ఎస్ టీ లకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం వెను వెంటనే రాజ్యాంగ సవరణ బిల్లు రూపకల్పన చేసి పార్లమెంట్ ఆమోదానికి చర్యలు తీసుకొన్నారు. 1994 ఆఖరు నాటికి 76 రాజ్యాంగ సవరణ చట్టంతో తమిళనాడు చట్టాన్ని 9వ, షెడ్యూల్ లో చేర్చింది.
9వ, షెడ్యూల్ అంటే ఏమిటీ?
నెహ్రు ప్రధానిగా ఉన్న కాలంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. 1951 జూన్ మాసంలో రాజ్యాంగ సవరణ ఫలితతంగా 9వ, షెడ్యూల్ ను ప్రవేశపెట్టారు. ప్రాథమిక హక్కులకు విరుద్దమైన చట్టాలకు న్యాయస్థానాల విచారణ నుండి రక్షన కల్పించేందుకు రాజ్యాంగంలో కొత్తగా ఈ షెడ్యూల్ ను చేర్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిబంధనను వాక్ స్వాతంత్ర్యం, పౌరుల ఆస్తిహక్కులను హరించే చట్టాలను కోర్టుల విచారణ నుండి తప్పించడానికి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ, షెడ్యూల్ లో చేరుస్తారు. ఈ షెడ్యూల్ లో ఏదైనా చట్టాన్ని చేర్చడానికి అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ కు అధికారం ఇచ్చే 31 బి అధికరణను రాజ్యాంగంలో చేర్చారు.
బిజెపి సహకారం కెసిఆర్ కు ఉంటుందా?
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తమకు అంగీకారం కాదని బిజెపి ప్రకటించింది.ఈ విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా బిజెపి నేతలు ఈ అంశాన్ని కుండబద్దలు కొట్టారు. రిజర్వేషన్ల కోటా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న తీర్మాణాన్ని కేంద్రానికి పంపితే కేంద్రం ఏం చేస్తోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ తీర్మాణాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. కేంద్రం దీన్ని పరిగణనలోకి తీసుకొంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది.ఆ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించే పనిని న్యాయశాఖ తీసుకొంటుంది. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాక రాష్ట్రపతికి పంపాలి.అలాగైతేనే రాజ్యాంగంలోని 9వ,షెడ్యూల్ లో చేరుస్తారు.అయితే ఈ పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్ల బిల్లు 9వ, షెడ్యూల్ లో చేర్చడం కష్టమేననే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ ప్రయోజనమెవరికీ?
రిజర్వేషన్ల కోటా పెంపు అంశంపై కేంద్రం తెలంగాణ పంపిన బిల్లును పక్కన పెడితే ఈ విషయమై నెపాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకొనే అవకాశం టిఆర్ఎస్ కు ఉంది. తాము రాష్ట్రంలో చేయాల్సిందంతా చేశాం, రాజ్యాంగ ప్రక్రియను రాష్ట్రంలో పూర్తి చేసి పంపాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు తాము వ్యవహరించామని టిఆర్ఎస్ చెప్పుకొనే అవకాశం లేకపోలేదు.అయితే ఈ విషయంలో కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మతప్రాతిపదికన రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తామని చెబుతున్న బిజెపి కూడ ఈ విషయంలో తమ అభిప్రాయానికి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.అయితే ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయంగా తమ ప్రాబల్యం పెంచుకొనేందుకు టిఆర్ఎస్ పై దూకుడు పెంచుకొనేందుకు బిజెపికి ఓ అస్త్రం లభించింది.అయితే ఈ అంశాన్ని ఈ రెండు పార్టీలు ప్రధానంగా తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.