హిందూ ఆలయాన్ని నిర్మించిన ముస్లిం మతపెద్ద
మధుర: ఓ ముస్లిం మత పెద్ద తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆయన నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం ఓ దేవాలయాన్ని నిర్మించారు.
ఉత్తరప్రదేశ్లోని మధురకు సమీపంలో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళితే.. సహారా గ్రామంలో ఎక్కువమంది ముస్లింలు నివసిస్తుంటారు. గ్రామంలో హిందూ దేవాలయం లేకపోవడంతో హిందువులు చిన్నచిన్న పూజలకు కూడా సమీపంలోని ఇతర గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లేవారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ ముస్లిం మతపెద్ద అజ్మల్ అలీషేక్.. గ్రామంలోనే హిందూ ఆలయాన్ని నిర్మించాలని తలచారు. అనుకున్నదే తడువుగా పనిని ప్రారంభించారు. ఇందుకోసం తన కష్టార్జితం రూ. 4 లక్షలతో పాటు పలువురి వద్ద చందాలు పోగుచేసి.. ఎనిమిది నెలల నుంచి ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు.
గత ఆదివారమే ఆలయంలో ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివుడు, హనుమాన్ తదితర హిందూ దేవుళ్లను ఆలయంలో ప్రతిష్టించారు. చిన్నాచితక పనులు మిగిలిపోయాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తానని మత పెద్ద అజ్మల్ అలిషేక్ చెప్పారు.