అక్కడొద్దు: విమానాశ్రయంపై వెంకయ్యXచంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల మధ్య ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయట. వెంకయ్య, చంద్రబాబులు ఒక్కటేనని, ఇద్దరు నాయుళ్ల కుట్ర వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెరాస, తెలంగాణ కాంగ్రెసు నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఇరువురు నేతలు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు ఎన్నో.
అయితే, అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో మాత్రం వీరి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయట. విజయవాడ దగ్గరలోని నూజివీడులో రెండువేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే, కొత్తగా మరొక విమానాశ్రయం కాకుండా ఇప్పటికే ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చితే బాగుంటుందని వెంకయ్య నాయుడు భావిస్తున్నారట.
నూజివీడు వద్ద కొత్త విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. దీనిని బిల్డ్, ఆపరేట్, ట్రాన్సుఫర్ (బీవోటీ) పద్ధతిలో చేపట్టాలనుకుంటున్నారట. అయితే, కొత్త రాష్ట్రానికి బీవోటీ పద్ధతిలో మరో కొత్త విమానాశ్రయం ఇబ్బందులతో కూడుకున్న పని అని వెంకయ్య చెబుతున్నారట.
బీవోటీ పద్ధతిలో నూజివీడు వద్ద కొత్తగా విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఏ ప్రయివేటు కంపెనీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని వెంకయ్య నాయుడు భావిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారట. ఈ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ నిర్మించినప్పటికీ అందులోని ఎన్నో సాదక బాధలు ఉన్నాయని చెబుతున్నారట. హైదరాబాదులోనే అలాంటి పరిస్థితి ఉంటే.. ప్రయాణీకులు తక్కువగా ఉండే నూజివీడులో కొత్త విమానాశ్రయం కష్టమని చెబుతున్నారట.
కొత్త విమానాశ్రయం ఆలోచన బదులు.. ఇప్పటికే ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారట. కాగా, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట.