భవిష్యత్తు: నారా లోకేష్ వర్సెస్ వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీంతో 2019 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని ఆయన ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తున్నారు. లోకేష్ చంద్రబాబుకు రాజకీయ వారసుడుగా కూడా వస్తుండటంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టపడుతుందని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో నారా లోకేష్ను కూర్చొపెడతారా అనే అంశంపై తెలుగుదేశం పార్టీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే లోకేష్కు పార్టీ పరంగా ఎంతో కీలకమైన కార్యకర్తల సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగించటం జరిగిందని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు, నారా లోకేష్కు మధ్య సమరంగా మారనున్నాయి.

ఐదేళ్లలో ప్రభుత్వాన్ని తానే నడిపిస్తూ, అప్పటికల్లా లోకేష్ను కూడా సమాయత్తం చేస్తే, సునాయాసంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవచ్చని చంద్రబాబు ఆలోచనగా వుందని తెలుస్తోంది. అనంతరం తాను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా చక్రం తిప్పాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
ప్రపధంమంగా తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి ఎన్టీ రామారావు ఒక్కడు మాత్రమేగా ఉండేది. పార్టీ జెండా, అజెండా అన్నీ తానై రూపకల్పన చేసిన ఎన్టీఆర్ వారసత్వం ఇప్పుడు టిడిపిలో లేకుండా పోయింది, 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలను చంద్రబాబు స్వీకరించిన ఈ 20 ఏళ్లలో నందమూరి వంశంతో సమన్వయం చేసుకుంటూనే టిడిపి అంటే నారా చంద్రబాబు నాయుడు, ఆ తరువాత లోకేష్ అనే స్థితికి తీసుకురావడంలో అపర చాణక్యరీతిని ప్రద ర్శించారు.
రెండు పర్యాయాలు అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు, ఈ కాలంలోనే నారా లోకేష్ను పార్టీలో క్రియాశీలకంగా తెరమీదకు తెచ్చారు. 2012లో చంద్రబాబు పాద యాత్ర వెనక లోకేష్ ఉన్నారనేది నాయకుల్లో కార్యకర్తల్లోకి వెళ్ళింది. ఈ మధ్యనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోకూడా లోకేష్ తనదైన శైలిలో పథకాలు రచించి, యువతను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను బాగా ఆకట్టుకొనే విషయంలో సఫలీకృతుడయ్యాడు.
అదే పార్టీ విజయానికి దోహత పడిందనే విషయాన్ని గట్టిగా కేడర్లో ప్రచారం జరిగింది. మొన్నటివరకు చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు, ఒకవేళ ఆ ప్రశ్న వచ్చినా దానికి సమాధానం లేదు. కాని ఇప్పుడు చంద్రబాబు తరువాత ఆయన వారసుడు లోకేష్ అనే మాట టిడిపితో పాటు అన్ని పార్టీల ప్రజలనుంచి వస్తోంది.
మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడితే జూన్ 19కల్లా లోకేష్ తెలుగుదేశంపార్టీ కార్యకర్తల సమన్వయ కర్తగా నియమితులయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పార్టీలో సర్వస్వం అనేవిధంగా ఒక పదవిని సృష్టించి, ఆ పదవిని లోకేష్కు అప్పగించటం వెనుక చంద్రబాబు చాణిక్య రాజకీయ నీతి దాగుందని ఆ పార్టీ నాయకులే తెలియ చేస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో చంద్రబాబు కూడా ఇదే పదవిలో ఉన్నారు.
1989 నాటి ఎన్నికల వరకు ఎన్టీఆర్కు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఇద్దరు అల్లుళ్ళు కీలకంగా మారారు. ఆతరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికలలో ఎన్టీఆర్లో పాటు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ఎంతో ఆవేశంగా మాట్లాటడం ఎన్టీఆర్కు నచ్చి, తన రాజకీయ వారసుడు బాలయ్యేనని అదే వేధికమీద ప్రకటించారు. దీనితో మొదటిసారిగా టిడిపిలో వారసత్వపు పోరు రచ్చకెక్కింది. బాలయ్యను వారసుడుగా ప్రకటించటంతో, అప్పటివరకు ఎన్టీఆర్ తరువాత తానే వారసుడిన అనుకొంటున్న చంద్రబాబు ఎన్టీఆర్ ప్రకటనతో ఇరకాటంలో పడ్డారు.
తరువాత చంద్రబాబు వత్తిడి మేరకు ఎన్టీఆర్ తన ప్రకటనను వెనక్కు తీసుకున్నారని బోగట్టా. అయితే 1993లో లక్ష్మిపార్వతి ఎన్టీఆర్ రెండవ భార్యగా ప్రవేశం చేసి రాజకీయ వారసురాలిని తానే అనే విధంగా మారారు. అప్పటికే పార్టీలో పట్టు సాధించిన చంద్రబాబుకు లక్ష్మిపార్వతి అడ్డుగా నిలిచారు. దీనితో చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్నే ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మలిచి, లక్ష్మిపార్వతి వంకతో రామారావును గద్దె దింపడంలో సఫలీకృతుడయ్యారు. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకమైన పదవులు కట్టబెట్టకుండా చంద్రబాబు చతురత ప్రదర్శించటంతో, అనతి కాలంలోనే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టిడిపిని వీడారు.
ఆ తరువాత బావమరిది హరికృష్ణ కు మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి, వెనక్కు తీసుకోవటంతో ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఆప్పటినుంచి టిడిపిలో చంద్రబాబు హవాకు ఎదురులేకుండా పోయింది. అనంతరం బాబుకు బాసటగా నిలిచింది బాలకృష్ణ ఒక్కడే అయ్యారు. 2008లో హరికృష్ణ తిరిగి పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. హరికృష్ణ చేరికతో ఆయన కుమారుడు జానియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టిడిపికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర మంతా సుడిగాలి పర్యటన చేసి తాతను మరిపించాడు. దీనితో టీడీపీ అధికంలోకి రాకపోయినా 92 స్థానాలలో విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీకి గట్టి ప్రతిపక్షంగా నిలిచింది. దాంతో తెలుగుదేశం పార్టీలో మరోసారి వారసత్వం పోరు ప్రారంభమైంది.
ఈ సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రవర్తించి లోకేష్ను ముందుంచి, క్రమంగా జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారు. గత 4 సంవత్సరాలనుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలను గురించి ఎన్టీఆర్కు ఏ మాత్రం సంబంధంలేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. ఈ పరిణామంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విధంగా పార్టీలో నందమూరి వాసన లేకుండా చేసుకోవటంతో పాటు, నారా లోకేష్ను తన తన వారసునిగా పార్టీకి తెలిసి వచ్చేలాగా చంద్రబాబు పావులు కదిపి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నిర్ణయాలను నందమూరి కుటుంబ సభ్యులు ప్రశ్నించే స్థితిలో లేకుండా పోయారు.












Click it and Unblock the Notifications