క్రాంతిసేన లేఖ అక్కడి నుంచే: నయీం పక్కా ప్లాన్
హైదరాబాద్: అజ్ఞాతం వీడి ప్రజాజీవితంలోకి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించడానికి గ్యాంగస్టర్ నయీం పక్కా ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే అతను టీవీ చానెల్ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు, అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, క్రాంతిసేన పేరు మీద వెలువడిన లేఖపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
గ్యాంగ్స్టర్ నరుూం ఎన్కౌంటర్ బూటకమని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదలిపెట్టబోమని హెచ్చరిస్తూ ఇటీవల క్రాంతిసేన పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన చత్తీస్గఢ్ నుంచే వచ్చినట్టు తెలుస్తోంది. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట ఒక ప్రకటన జారీ అయింది. అయితే ఈ లేఖ లెటర్హెడ్లో కాకుండా తెల్లకాగితంపై రాసి ఉండడం, ఎన్కౌంటర్ జరిగిన పది రోజుల తరువాతవారి సంతకాలతో కూడి ఉండడం పలు అనుమానాలను రేకెత్తించింది.
దాంతో పోలీసులు క్రాంతిసేన లేఖపై దర్యాప్తు చేపట్టారు. ఈ లేఖ తెలంగాణలోని ఒక జిల్లా నుంచే వచ్చినట్టు పోలీసులు మొదట అనుమానించారు. అయితే నల్గొండ జిల్లాలో నయీం అనుచరుల ఆగడాలు కొనసాగుతున్నాయని వచ్చిన వార్తలతో సిట్ అధికారులు క్రాంతిసేన లేఖను తీవ్రంగా పరిగణించి ఆరా తీస్తున్నారు. ఆ లేఖ చత్తీస్గఢ్ నుంచి కొందరు నయీం అనుచరులు పంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
నయీం అనుచరులపై దాడులు, ఇళ్లల్లో సోదాలు జరగకుండా ఉండేందుకే క్రాంతిసేన పేరుతో లేఖ పంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ లేఖ నకిలీదా లేదా నయీం అనుచరుల్లో కొందరు కావాలని సృష్టించారా అనే విషయాన్ని సిట్ అధికారులు స్పష్టం చేయడం లేదు. ఇదిలావుండగా నరుూం అనుచరుల ఇళ్లలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి.
నల్గొండ జిల్లాలోని వలిగొండలో, మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ సమీపంలోగల అల్కాపురి, హైదరాబాద్ వనస్థలిపురంలో, ఖమ్మం జిల్లాలో సిట్ అధికారులు నరుూం అనుచరులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాజీవితంలోకి వచ్చేందుకే నరుూం నల్గొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్రెడ్డి అనే జర్నలిస్టును సిఈవోగా పెట్టి వెబ్ చానెల్ ఏర్పాటు చేయించాడని అంటున్నారు.
భువనగిరి ఎమ్మెల్యే కావాలనేది నయీం చిరకాల వాంఛ. ఇందుకు త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. జర్నలిస్టు హరిప్రసాద్ను సిట్ అధికారులు విచారిస్తుండగా అతను పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది.
నయీం నుంచి తాను డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నయీంకు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, నిరుడు వినాయకచవితి ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏం ఇచ్చిందీ, జర్నలిస్టులు, నరుూం అనుచరులకు ఎలాంటి గిఫ్ట్లు, నగదును ఇచ్చిందీ సిట్ అధికారులకు హరిప్రసాద రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 62 మందికి విలువైన గిఫ్టులు, నగదును హరిప్రసాద్ ద్వారా నరుూం అందజేసినట్టు నయీం డైరీలో పేర్కొన్నట్టు సమాచారం.
తాను భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు ఎవరు పోటీగా నిలబడతారు, ఎంత మంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకొని చెప్పాలని కూడా హరిప్రసాద్రెడ్డికి నయీం సూచించినట్టు తెలుస్తోంది. టివి చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తరువాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చేందుకు నయీం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సిట్ అధికారుల విచారణలో తేలినట్లు చెబుతున్నారు.
నయీంను కలిసేందుకు అతని మేనల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లినట్టు తనకు కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారని, ఎన్కౌంటర్ తరువాత తనకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారని, నయీం పోయాడు కాబట్టి అనుచరులందరి ఇళ్ళపైనా దాడులు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని వారికి హరిప్రసాద్ రెడ్డి సూచించినట్టు సిట్ విచారణలో బయటపడిందని అంటున్నారు.
నయీం పిసినారి...
భూ కబ్జాలు, హత్యలు, సెటిల్మెంట్లు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగుచేసుకున్న గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారంలో మాత్రం పిసినారి అని తెలిసింది. చివరికి తన సొంత కుటుంబ సభ్యులకు కూడా సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదని విచారణలో బయటపడిందని అంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న నయీం కుటుంబ సభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో నిందితులు.
అయినా కూడా కుటుంబం గడవడానికి బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో నయీం కుటుంబ సభ్యులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల తరహాలోనే నయీం పక్కాగా మిలిటెంట్ డైరీ రాసుకునేవాడని, ఏ రోజు, ఎప్పుడు, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో రాసుకునేవాడని తేలింది. ఫొటోలు కూడా తీసి దాచుకునేవాడని చెబుతున్నారు.