అప్పటి దాకా జీవించే! 1949లో రేడియోలో మాట్లాడాలనుకున్న నేతాజీ
కోల్కతా: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1949లో రేడియోలో ప్రసంగించాలనుకున్నారా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా వెల్లడి చేసిన రహస్య దస్త్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి.
మమత ప్రభుత్వం విడుదల చేసిన రహస్య ఫైళ్లలో పలు కీలక అంశాలు వెల్లడౌతున్నాయి. నేతాజీ 1945లో విమాన ప్రమాదంలో చనిపోలేదని ఎప్పటినుంచో చెప్తున్న ఆయన కుటుంబసభ్యుల మాటలకు బలం చేకూర్చేలా ఓ ఫైలులోని అంశం ఉంది.
1949లో నేతాజీ రేడియోలో మాట్లాడాలనుకున్నారంటూ అప్పట్లో లండన్లో ఉన్న ఆయన మేనల్లుడు అమియానాథ్ బోస్ కోల్కతాలోని తన సోదరుడు శిశిర్ కుమార్ బోస్కు లేఖ రాశారు. 1949 నవంబర్ 18న రాసిన ఆ లేఖలో.. నెల రోజులకు పైగా రేడియోలో కొత్త ప్రసారం వినిపిస్తున్నది.
నేతాజీ సుభాష్ చంద్ర ట్రాన్స్మిటర్ మాట్లాడాలనుకుంటున్నది అని ప్రసారమవుతున్నదంటూ అమియానాథ్ బోస్ పేర్కొన్నారు. 16ఎంఎం షార్ట్వేవ్పై ఈ విషయం గంటల తరబడి ప్రసారమవుతున్నదని, కానీ ఈ ప్రకటన ఎక్కడినుంచి వస్తున్నదనేది మాత్రం అర్థం కావడంలేదని తెలిపారు.
అయితే అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు కోల్కతా పోలీసులకు చెందిన గూఢచార సంస్థ.. ఈ లేఖను శిశిర్ కుమార్కు చేరకుండా అడ్డుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ఉంది.
కోల్కతా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఐబీ డీఐజీకి 1949 జనవరి 25న నివేదిక సమర్పించినట్లు పేర్కొంది. దీంతో నేతాజీ కుటుంబ సభ్యులు తమ మాటే నిజమైందంటున్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్లోని తైహోకులో విమాన ప్రమాదంలో నేతాజీమరణించారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. దీనిని ఆయన కుటుంబసభ్యులు మొదటినుంచీ ఖండిస్తూనే ఉన్నారు.
నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ కూడా తాను యూరప్లో పర్యటించిన సందర్భంగా చంద్రబోస్ చైనాలో ఆ దేశ సైన్యం ఆధీనంలో ఉన్నట్లుగా తెలిసిందని చెప్పినట్లు ఓ ఫైలులో పేర్కొన్నారు. నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టించిన అప్పటి ప్రభుత్వానికి అన్ని సమాచారాలూ ఎప్పటికప్పుడు అందేవని తెలిపారు. శరత్ చంద్రబోస్ మే 11న బొంబాయికి చేరుకున్నారని, మే 13న జెనీవాకు వెళ్లారని, ఫైలులో పేర్కొన్నారు.