కొత్త రకం పందిని సృష్టించిన ఎస్వీయూ పరిశోధకులు: సీమ, నాటు పందుల సంకరం..
ఈ సంకరం నుంచి 21తరాలకు చెందిన వరాహాలపై పరిశోధనల జరిపిన తర్వాత.. ఎట్టకేలకు ఎలాంటి అవలక్షణాలు లేని మేలైన కొత్త వరాహా జాతిని సృష్టించగలిగారు.
తిరుపతి: సీమ పందుల్ని, నాటు పందుల్ని సంకరీకరించడం ద్వారా కొత్త రకం వరాహాన్ని తీర్చిదిద్దారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ పరిశోధకలు. 1987నుంచి 2007వరకు సీమ పందులు, నాటు పందులకు మధ్య సంకరం జరపడం ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ సంకరం నుంచి 21తరాలకు చెందిన వరాహాలపై పరిశోధనల జరిపిన తర్వాత.. ఎట్టకేలకు ఎలాంటి అవలక్షణాలు లేని మేలైన కొత్త వరాహా జాతిని సృష్టించగలిగారు.
కొత్తగా సృష్టించిన వరహానికి 'తిరుపతి వరాహా' అని నామకరణం చేయడం విశేషం. శనివారం నాడు భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకె జీనా ఈ రకాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
వీసి ప్రొఫెసర్ వై.హరిబాబు దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాతో పంచుకున్నారు. తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్స్ లో 1971నుంచి పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు.
1971నుంచి 80వరకు లార్జ్ యార్క్ షైర్ పిగ్స్(సీమ పందుల)పై, 1981నుంచి 87వరకు దేశీయ(నాటు పందుల)పై పరిశోధనలు జరిపినట్లు వివరించారు.అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని రూపొందించినట్లు తెలిపారు. 21తరాల సంకరం తర్వాత మేలైన కొత్త రకాన్ని అందించగలిగామన్నారు.
త్వరలోనే దీన్ని రైతులకు, పందుల పెంపకం పంపిణీ చేస్తామన్నారు. తిరుపతి వరాహా రకంలో 75శాతం సీమ పందుల లక్షణాలు, 25శాతం నాటు పందుల లక్షణాలు ఉంటాయన్నారు.
ప్రస్తుతం తమ వద్ద 224పందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఆనిమల్ జెనటిటక్ రీసెర్చ్(ఎన్బీఏజీఆర్) శనివారం ఈ కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకుంటారని, ఒకరకంగా ఇది పేటెంట్ పొందడమేనని అన్నారు.