ఆంధ్రప్రదేశ్ రాజధాని: హైదరాబాద్ పొరపాటు, పాఠమే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నిశ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో జరగకూడదని ఆ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికపై కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ త్వరలోనే తన నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే రాష్ట్రమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలనూ పరిశీలించిన ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను రూపొందించినట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు తమకే కావాలంటూ డిమాండ్లు పెడుతున్నారు.
జమ్మూ కశ్మీర్ తరహాలో రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించారు. కర్నూలును రెండో రాజధానిగా చేయాలని మంత్రి పరిటాల సునీతలాంటి వారు కూడా అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ మాత్రం రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని సూచించింది. దీనికి తోడుగా పలు ఉప రాజధానులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.
పరిపాలనతోపాటు అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ప్రతీ చోట పౌరసమాజం ఎదుగుదలకు పెద్ద పీట వేయాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతీ పట్టణం, నగరం దేనికదే ఎదిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. నిర్దిష్టంగా ఫలానా నగరంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని స్పష్టం చేయకుండా కొత్త రాజధాని ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రాంతాలు, ప్రత్యామ్నాయాలను సూచించనున్నట్లు తెలిసిందంటూ తెలుగు దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఆ వార్తాకథనం ప్రకారం - కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి హైదరాబాద్ నుంచి గుణపాఠం నేర్చుకోవాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందింది. పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. పౌర సమాజం ఎదిగింది. అందరి దృష్టి హైదరాబాద్పైనే కేంద్రీకృతం కావడంతో మిగతా నగరాలు, పట్టణాలు చెప్పుకోదగ్గస్థాయిలో అభివృద్ధి చెందలేదు. గత కొన్నేళ్లలో వికేంద్రీకరణ జరిగినా ఏ నగరంగానీ, పట్టణంగానీ హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీని తీవ్రతను కమిటీ తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
రాజధాని రేసులో ఐదు నగరాలు పోటీ పడుతున్నాయని కమిటీ తెలిపినట్లు సమాచారం. వీటిలో ఒక నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసి మిగిలిన వాటిని వాటికున్న ప్రత్యేకతల ఆధారంగా ఉప రాజధానులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
ఇవీ కమిటీ అభిప్రాయాలు...
పాలనా సౌలభ్యం కోసం రాజధాని ఉన్న చోటే సచివాలయం, ఆయా ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు, హైకోర్టు, ఇతర న్యాయ సంస్థలు ఉండాలి. విద్యారంగం విస్తరణ, అభివృద్ధికి ప్రత్యేక హబ్ను ఏర్పాటు చేయాలి. ఐటీ రంగం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఏపీలోని కీలకమైన పట్టణాలు, నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించి వెనుకబాటు ఉన్న ప్రాంతాల్లో ఐటీసెక్టార్ను ప్రోత్సహించడం ఆ ప్రాంతాల అభివృద్ధికి మార్గం వేయడమవుతుది.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక హబ్ను రూపొందించాలి. పరిశోధనా సంస్థలను ఒక ప్రాంతానికే పరిమితం చేయవద్దు. ఆయా ప్రాంతాలకున్న ప్రత్యేకతల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వైద్య రంగాన్ని ఒక్క పట్టణానికో, ప్రాంతానికో పరిమితం చేయకుండా ప్రతీ రెండు జిల్లాలకు కలిపి ఒక మెడికల్ హబ్ను ఏర్పాటు చేయాలి.
గుంటూరును ఎడ్యుకేషన్ హబ్గా, విజయవాడను ఆర్థిక రాజధానిగా, ఉత్తరాంధ్రను ఐటీ క్యాపిటల్గా, కర్నూలు, అనంతపురం జిల్లాలను రీసెర్చ్ జోన్గా, కోస్తా జిల్లాలను వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ప్రకటించాలి.