శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!
ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని భావించిన శశికళపై అన్నాడీఎంకే కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందా? ఆమె పదవి చేపట్టడం కేంద్రానికి ఇష్టం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని భావించిన శశికళపై అన్నాడీఎంకే కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందా? ఆమె పదవి చేపట్టడం కేంద్రానికి ఇష్టం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి శశికళ వైఖరి పట్ల ఏమాత్రం సదభిప్రాయం లేని ప్రధాని మోడీకి ఆమె ముఖ్యమంత్రి కావడం ఏమాత్రం ఇష్టం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ 22న ఏం జరిగింది?: జయను తోసేసి.. శశికళపై సంచలనం
ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనా గతంలో తనకు తెలిసిన కొన్ని సంఘటనల దృష్ట్యా 'మన్నార్గుడి మాఫియా' పట్ల ప్రధానికి ఎంతమాత్రం సదుద్దేశం లేదని తెలుస్తోంది.
నాడే జయలలితకు మోడీ హెచ్చరిక
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ బృందం వైఖరి గురించి జయలలితను హెచ్చరించడం వల్లనే 2011లో చిన్నమ్మను జయ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. దీనిపై 2012లో 'తెహల్కా' ఒక కథనాన్ని ప్రచురించింది.
పరిశ్రమపై.. శశికళతో జాగ్రత్త చెప్పిన మోడీ
ఆ కథనం ప్రకారం.. గుజరాత్కు చెందిన ఒక ఎన్నారై తమిళనాడులో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించారు. తమిళనాడులో పరిశ్రమ పెట్టాలంటే తమకు ప్రాజెక్టు వ్యయంలో పదిహేను శాతం ముట్టజెప్పాలని మన్నార్ గుడి మాఫియా డిమాండ్ చేసింది. దీంతో ఆయన గుజరాత్కు వెళ్లి అక్కడే పరిశ్రమ పెట్టుకొన్నారు. మాటల సందర్భంలో నాటి గుజరాత్ సీఎం మోడీకి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో మోడీ నేరుగా జయలలితకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. శశికళ ముఠాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
శశికళపై నిఘా.. ఫైల్ తారుమారు
అప్రమత్తమైన వారిపై నిఘా పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే. చెన్నై మోనో రైలు ప్రాజెక్టు తెర పైకి వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న జయలలిత దానిని సింగపూర్కు చెందిన ఒక పెద్ద కంపెనీకి అప్పగించాలని భావించారు. ఈ విషయాన్ని నాటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపి ఫైల్ తయారు చేయాలని సూచించారు. కానీ ఆమె ఆదేశాలకు విరుద్ధంగా ఏదో మలేషియన్ కంపెనీకి ఆ ప్రాజెక్టు అప్పగించాలన్న ప్రతిపాదనతో ఫైల్ తయారైంది. ఆశ్చర్యపోయిన జయలలిత దీనిపై సీఎస్ను ప్రశ్నించగా.. మీరు పంపిన నోట్ ఆధారంగానే ఫైల్ తయారు చేశామని చెప్పి, ఆమె సంతకంతో ఉన్న నోట్ను చూపారు. అసలు ఆ నోట్పై ఉన్న సంతకం తనది కాదని, ఫోర్జరీ అని గుర్తించిన జయ దానిపై ఆరా తీయడంతో మన్నార్ గుడి మాఫియా ప్రమేయం బయటపడింది.
శశికళ ఇచ్చే మెడిసిన్స్పై అనుమానం
ఆ తర్వాత, శశికళ తనకు ఇస్తున్న మందులపైనా జయకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా ఆమెకు ఇచ్చే మందుల్లో మత్తు కలిగించే పదార్థాలు, కొద్దిపాటి మోతాదులో విషం కలిగిన రసాయన అవశేషాలు(స్లోపాయిజన్) ఉన్నట్టు తేలినట్లుగా వార్తలు వచ్చాయి.
వీరి సీక్రెట్ విని జయలలిత దిగ్భ్రాంతి
2012 డిసెంబరు మొదటి వారంలో శశికళ కుటుంబ సభ్యులు పలువురు బెంగళూరులో రహస్యంగా సమావేశమయ్యారని జయలలితకు తెలిసింది. అక్కడ వారి సంభాషణను కర్ణాటక ఇంటెలిజెన్స్ వర్గాలు రికార్డు చేసి నాటి తమిళనాడు డీజీపీ కె రామానుజానికి అందించాయి. ఆ ఆడియో టేపులను విన్న జయలలిత తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అక్రమాస్తుల కేసులో తాను సీఎం పదవిని కోల్పోతే, ఎవరు సీఎం కావాలన్న దానిపై శశికళ, ఇతర కుటుంబ సభ్యుల నడుమ చర్చ జరిగినట్లు ఆ టేపుల్లో ఉంది.
ప్రయివేటు డిటెక్టివ్
కొద్ది రోజులపాటు మన్నార్ గుడి మాఫియాపై ప్రయివేటు డిటెక్టివ్లతో నిఘా కొనసాగింది. ఈ నిఘాలో మన్నార్గుడి మాఫియా చేయించిన తాంత్రిక పూజల గురించి కూడా బయటపడిందని పేర్కొన్నారు.
ఇదీ పెద్ద కథే..!
2011 ఎన్నికల్లో ఈరోడ్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి రామలింగం అనే అభ్యర్థి గెలిచాడు. అతడికి శశికళనే టిక్కెట్ ఇప్పించారు. జయ స్థానంలో శశికళ ముఖ్యమంత్రి అయ్యేలా చేసేందుకు కేరళలో అతడికి తెలిసిన మాంత్రికులతో మన్నార్ గుడి మాఫియా క్షుద్రపూజలు చేయించింది. అయితే రామలింగం ఆ ముఠాను కూడా మోసం చేశాడని, తానే తమిళనాడు సీఎం అయ్యేలా క్షుద్రపూజలు చేయించాడని డిటెక్టివ్ల నిఘాలో తేలింది. ఈ నివేదికలు అందిన వెంటనే జయలలిత ప్రక్షాళనకు దిగారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ విభాగంలో పాతుకుపోయిన శశికళ అనుచరగణాన్ని బదిలీ చేశారు.
సిబ్బంది మార్పు
అనంతరం వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ మార్చేశారు. డిసెంబరు 17, 2011న శశికళతోసహా మన్నార్ గుడి మాఫియాను పోయస్ గార్డెన్ వదిలి వెళ్లాలని జయలలిత ఆదేశించారు. మరుసటి రోజు శశికళ, ఆమె భర్తసహా పలువురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే మన్నార్ గుడి మాఫియాపై ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి. పలువురి ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అయితే, జరిగిన ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని శశికళ.. జయలలితను వేడుకొన్నారు.
మళ్లీ అమ్మ దరికి
సుమారు పదిహేను రోజులపాటు ఆహారం ముట్టకుండా జయలలిత కరుణ కోసం తప్పించారు. ఎట్టకేలకు అమ్మ కరుణించింది. దూరం పెట్టి ముచ్చటగా మూడు నెలలు కాకుండానే తిరిగి శశికళను అక్కున చేర్చుకుంది. ఇదంతా తెలిసినందునే మోడీ శశికళ పట్ల విముఖంగా ఉన్నట్టు సమాచారం.
జయ నమ్మినా.. మోడీ నమ్మకపోవడం..
ఆమెను జయలలిత నమ్మి ఉండొచ్చుగాని.. ప్రధాని మోడీకి మాత్రం ఆమెపై నమ్మకం లేదనే విషయాన్ని ప్రధాని కార్యాలయ వర్గాలు అన్నాడీఎంకే ఎంపీలకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వారు ఆదివారం (ఫిబ్రవరి 5) ఉదయం వరకూ కూడా శశికళకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.
మోడీ మాట ఖాతరు చేయకుండా..!
అయితే వారి మాటల్ని ఖాతరు చేయని శశికళ ముఖ్యమంత్రి పీఠం వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు ఆమె ముందున్న మార్గాలు రెండే. బీజేపీ ముందు మోకరిల్లడం, లేదా ఢీకొట్టడం. కానీ అన్నాడీఎంకేతో రాజ్యసభలో అవసరమున్నా.. బీజేపీ శశికళతో సయోధ్యకు అంగీకరించేలా కనిపించడం లేదంటున్నారు. ఆమె శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం బీజేపికి కలసి వచ్చింది. దీంతో, మొత్తం అపవాదు బీజేపీ పైకి వెళ్లడం లేదు.
కేంద్రంతో ఢీకొంటే..
ఒకవేళ ఆమె కేంద్రంతో ఢీకొంటే పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారవచ్చని, ప్రజల్లో ఉన్న అనుమానాలను అనుకూలంగా మార్చుకుని శశికళను దోషిగా నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.