ఇంకెంత కాలం?: భార్యను మోసుకొని 4కి.మీలు నడిచాడు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. అక్కడి గిరిజనుల దుస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వాలు పని చేస్తున్నా.. గిరిజనులకు మాత్రం వైద్య సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.
ఇటీవల ఓ వ్యక్తి డబ్బులు లేని కారణంగా తన భార్యకు వైద్యం అందించలేక ఆమెను కోల్పోయాడు. ఆ తర్వాత అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించకపోవడంతో అతడు తన భార్య శవాన్ని భుజంపై 10 కిలోమీటర్లు నడిచి తన సొంత గ్రామం చేరుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. దానా మాఝీ అనే అతడు తన భార్యను కోల్పోయిన తర్వాత ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం గమనార్హం.
కాగా, దానా మాఝీ ఘటన మరువక ముందే ఒడిశా రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితిని అద్దం పట్టే మరో ఘటన చోటు చేసుకుంది. రాయగడ జిల్లాలోని కె.సింగ్పూర్ సమితికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాబుగుడకు చెందిన అర్జున్ కురిసిక భార్య రుయమణి(30) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
బుధవారం ఆమె పరిస్థితి మరింత విషమించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడం, మార్గమధ్యలో వాగు ఉండడంతో తనే భార్యను భుజంపై మోసుకొని కె.సింగ్పూర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చాడు.
ఇటీవల కాలంలో పలువురు వైద్యం కోసం 108, 102 వాహనాలకు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో తనూ వాటికి ఫోను చేయలేదని అర్జున్ ఈ సందర్భంగా తెలపడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పేద గిరిజనులకు వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.