ఆనాడు బాబుకు వైఎస్: నేడు జగన్కు పవన్ కల్యాణ్?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏ విధమైన పాత్ర పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బిజెపి కూటమి విజయంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి కారణమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అదే పని చేయబోతుందనే మాట వినిపిస్తోంది. అయితే, దాన్ని మరో రూపంలో అమలు చేయడానికి పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే కత్తులు నూరుతున్నట్లు చెబుతున్నారు కేవలం 5లక్షల ఓట్లతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరాజయాన్ని చవి చూసింది. అయితే 2019 ఎన్నికలపై జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే జగన్ ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లబోతున్నారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రావని ఆ చంద్రబాబు నిర్వహించిన ఓ రహస్య సర్వేలో తేలిందని సమాచారం.
అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయితే ఈ స్థితిలో పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేశారు. జనసేన ఈ సారి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే గత ఎన్నికల ప్రభావమే మళ్లీ జగన్పై పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
జనసేన పూర్తిగా అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్ అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరిగ్గా 2009 ఎన్నికల్లోని పరిస్థితి మళ్లీ పునరావృ మవుతున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే ముందు జరిగిన ఎన్నికల వ్యవహారాన్ని తలపించే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్న తరుణంలో చిరంజీవి స్థాపిం చిన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ విజయం సాధించి మళ్లీ వైయస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దిగితే జగన్ అవకాశాలు అలాగే దెబ్బ తినవచ్చునని అంటున్నారు.