కాశ్మీర్, బేడీపై విభేదాలు: బీజేపీది తప్పేనని ఆరెస్సెస్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలని తెచ్చాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని బరిలోకి దింపి బీజేపీ తప్పు చేసిందని ఆరెస్సెస్ తన పాంచజన్య పత్రికలో పేర్కొంది.
బేడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ... ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికలో బీజేపీ తప్పుచేసిందని పాంచజన్య పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బేడీ పేరు ప్రకటనను సంఘ్ కూడా ఆమోదించిందని బీజేపీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు.
కిరణ్ బేడీని నిలపడం వల్లనే బీజేపీ ఘోర పరాజయం పొందిందని అభిప్రాయపడింది. అభ్యర్థుల ఎంపికలోను పార్టీ తప్పు చేసిందని పేర్కొంది. కేంద్రమంత్రి హర్షవర్ధన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడితే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పింది. అతివిశ్వాసంతో పోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని చురకలు అంటించింది.
జమ్మూ కాశ్మీర్ పైనా...
జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ కీలక అంశాలమీద వెనక్కు తగ్గటంపై కూడా ఆరెస్సెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) పేరిట సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పట్టు సడలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
దీంతోపాటు ఉమ్మడి పౌరస్మృతి, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 విషయంలోనూ వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని సూచించింది. అటు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన పీడీపీ ఇప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ వీటిపైనే పట్టుబడుతోంది. కీలకమైన శాఖలు బీజేపీకి ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు.
జనవరి 9న రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలులోకి వచ్చినప్పటినుంచి బీజేపీ, పీడీపీ మధ్య ఈ మూడు ముఖ్యాంశాల పైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. పీడీపీ - బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని చేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఇరు పార్టీలుకూడా దీనిపై చెబుతున్నాయి. అయితే, ఆరెస్సెస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.