కెసిఆర్ 'చిత్ర' వ్యూహం: సినీ దిగ్గజాలతో 'బస్తీ' షో
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం బస్తీ ఆడియో విడుదల వేడుక పెద్ద మలుపుగా చెప్పవచ్చు. జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా నటించిన బస్తీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరు కావడం, చలనచిత్ర పరిశ్రమపై తనకు ఉన్న అభిప్రాయాలను ఆయన వెల్లడించడం హైదరాబాదులో స్థిరపడిన సినీ దిగ్గజాలకు ఊరటగా చెప్పవచ్చు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కెసిఆర్ ఓ సినీ కార్యక్రమానికి హాజరు కావడం ఇదే తొలిసారి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సీమాంధ్ర పెద్దల గుప్పిట్లో ఉందనే అభిప్రాయం బలంగా ఉన్న నేపథ్యంలో వారికి ఏ విధమైన ఢోకా ఉండదని కెసిఆర్ హామీ ఇచ్చారు. కళాకారులకు ఎల్లలు ఉండవని, అమితాబ్ బచ్చన్ను అన్ని ప్రాంతాల వారు, అన్ని వయస్సులవారు అభిమానిస్తారని చెప్పారు.
పద్మాలయ స్టూడియో వంటి వాటి విషయంలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించారు. సినీ స్టూడియోల విషయంలో ఉన్న లొసుగులేమిటని చెప్పకుండా వాటి యాజమానులకు అర్థమయ్యే విధంగా చెప్పారు. సమస్యలను పరిష్కారనని హామీ ఇచ్చారు.
తెలంగాణ స్థానం
తెలంగాణ కళాకారులకు సరైన అవకాశాలు లభించడం లేదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దాచిపెట్టలేదు.
తెలంగాణ గాయకులు..
తెలంగాణ గాయకులు సుద్దాల అశోక్ తేజ వంటివారు సినిమా రంగంలో ఉన్నారని, తెలంగాణ గాయకులను దాసరి నారాయణ రావు ప్రోత్సహించారని ఆయన అన్నారు.
మూసస్తంభాల వంటివారు..
తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభాలు అనదగిన దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, విజయనిర్మల, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీమోహన్ తదితరులు ఈ వేడుకలకు హాజరు కావడం, ఆ సమావేశంలో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కెసిఆర్ తన మనోగతాన్ని చెప్పడం విశేషం.
చిరంజీవి పేరు కూడా ప్రస్తావన..
తాను చిరంజీవితో ఇప్పటికే ఓసారి మాట్లాడానని, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసే సమావేశంలో చిరంజీవి కూడా ఉంటారని కెసిఆర్ చెప్పారు.
ప్రాంతాలకు అతీతంగా..
ప్రాంతాలకు, రాష్ట్రాలకు, రాజకీయాలకు అతీతంగా సినీ పరిశ్రమను తాను చూస్తున్న విషయాన్ని కెసిఆర్ చెప్పకనే చెప్పారు.
సభ కూడా అలాగే...
బస్తీ ఆడియో విడుదల వేడుకకు కాంగ్రెసు నేత టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగదేశం పార్టీ నేత మురళీ మోహన్ వంటి వారు రావడం వల్ల కూడా కెసిఆర్ అభిమతం స్పష్టంగా అర్థమవుతోంది.
సరదాగా మొదలు పెట్టి...
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రసంగాన్ని సరదాగా ప్రారంభించి, సీరియస్ విషయాల్లోకి వెళ్లిపోయారు. తన వరకు తాను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు వరకే సినిమాలు చూశానని, ఆ తరువాత చూడలేదుని, ఆ అవకాశం పోయిందని కెసిఆర్ అన్నారు. ఇప్పుడు మళ్లీ శ్రేయన్ సినిమాతోనే సినిమాలు చూడటం ఆరంభిస్తాను అని కేసీఆర్ అన్నారు. .
మళ్లీ చూస్తా...
సినిమాలు చూడడం శ్రేయాన్ బస్తీ సినిమాతో మళ్లీ ప్రారంభిస్తానని కెసిఆర్ చెప్పారు. అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీ రామారావు హైదరాబాదులో సినీ పరిశ్రమ స్థిరపడడానికి చేసిన కృష్టిని కెసిఆర్ ప్రస్తావించారు.
అవసరమైతే ఫిలింనగర్ -2
అవసరమైతే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ఫిలింనగర్కు తోడుగా ఫిలింనగర్-2 ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమేనని కెసిఆర్ చెప్పారు.
జయసుధ చెప్పారు..
తన అబ్బాయిని శిక్షణకోసం ముంబై పంపించానని జయసుధ చెప్పారని, ఇంతపెద్ద నగరం పెట్టుకుని మనం షూటింగ్, శిక్షణ కోసం ముంబయి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదని, మన దగ్గరనే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలను ఏర్పాటు చేసుకుందామని కెసిఆర్ అన్నారు.
ప్రతి ఒక్కరికీ..
సినిమా షూటింగ్లో పనిచేసే లైట్మెన్ దగ్గరనుంచి అందరు కార్మికులకు కూడా ఇండ్లను నిర్మించడంతోపాటు వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని కెసిఆర్ చెప్పారు. ఇక్కడ అవకాశాలు రానివారికి మరోచోట అవకాశం కల్పిద్దామని, పేద కార్మికులకు రూపాయికి గజం చొప్పున స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుందామని ఆయన అన్నారు.