మోడీతో ఏకాతంగా: దాటేసిన జగన్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచిత్రమైన సమాధానం ఇచ్చారు. సోమవారంనాడు వైయస్ జగన్ తన పార్టీ పార్లమెంటు సభ్యులతో ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మీరు మోడీతో ఏకాంతంగా మాట్లాడారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి - ‘ఏ నాయకుడైనా మరో పార్టీ నేతనో.. హైపొజిషన్లో ఉన్న నాయకుడినో కలిసినప్పుడు.. వినతిపత్రం ఇచ్చిన తర్వాత కచ్చితంగా ఒక ఐదు నిమిషాలు వారితో కలిసి కాఫీ తాగి.. ఇంటిదగ్గర పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగా చదువుతున్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు? వంటి కుశల ప్రశ్నలు వేసి, వారితో తమ సంబంధాలు బాగుండాలనే చూసుకుంటారు సార్!' అని ఆయన జవాబిచ్చారు.
ఆ తర్వాత కాస్తా విసుగు కూడా ప్రదర్సించారు. ఎఫ్డీఐలపై ఓటింగ్ నేపథ్యంలో చీకట్లో చంద్రబాబు, సుజనా చౌదరిని వెంటబెట్టుకుని చిదంబరాన్ని కలిస్తే అప్పుడు మీరెందుకు ఈ ప్రశ్న చంద్రబాబును అడగలేదు? అని ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వటంలో కేంద్రం జాప్యం చేస్తోందని, ఆ విషయంలో ప్రధాని నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అని అడగ్గా.. వాస్తవానికి మోడీని తాము కలవటం రెండోసారని, కేంద్రంలోని మంత్రుల్ని మూడుసార్లు కలిశామని, మరోమారు కలుస్తామని, తాము చేయగలిగిందంతా చేస్తున్నామన్నారు.
తమ బలం చిన్నదని ఆయన అన్నారు. ‘మేమేమన్నా మంత్రి పదవుల్లో ఉన్నామా?వాటి నుంచి బయటకు రావడానికి' అని ప్రశ్నించారు. పట్టిసీమతో ఏపీ 70 టీఎంసీల నీటిని నష్టపోతుందని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీకి వివరించామని జగన్ చెప్పారు.

గతంలోనూ...
ఏపీ అభివృద్ధికి సంబంధించి గతంలో మోడీని కలిసి పలు విజ్ఞప్తులు చేశామని, మళ్లీ వాటిని ఓసారి గుర్తు చేశామని జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాలు, జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, మొదలైన అంశాలన్నీ ఇందులో ఉన్నాయన్నారు.

పోలవరం, పట్టిసీమ కూడా..
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల అంశాన్ని కూడా మోడీ దృష్టికి తీసుకెళ్లామని జగన్ చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పోలవరాన్ని కోల్డ్స్టోరేజ్లో పడేస్తారన్న తమ భయాన్ని ప్రధానికి వివరించామన్నారు. పట్టిసీమ అమలులోకి వస్తే గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న 7ఈ, 7ఎఫ్ క్లాజుల ద్వారా ఏపీ 70 టీఎంసీల నీరు నష్టపోతుందని చెప్పామన్నారు.

అనుమతి ఇచ్చిన వెంటనే..
పోలవరానికి సీడబ్ల్యుసీ అనుమతి వచ్చిన వెంటనే 35 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ట్ర నిలుపుకోవచ్చునని 7ఈలో పేర్కొన్నారని, గోదావరి నుంచి అదనంగా ఎన్ని నీళ్లు ఏపీ బదిలీ చేస్తే అంత మేరకు నీటిని అడిగే హక్కు కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుందని 7ఎఫ్లో పేర్కొన్నారని జగన్ చెప్పారు. ఈ అంశాలపై తమ భయాలను నివృత్తి చేసిన తర్వాతే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కోరామన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..
ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు కావాల్సిన కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా పట్టిసీమ ప్రాజెక్టును కట్టబెట్టారని ఆరోపించారు. ఎక్కువ మొత్తానికి టెండర్ వేసినా ఆ మేరకు బోనస్ ప్రకటించారని, నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తే ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొన్నారని, ఇలాంటి టెండర్ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు. చంద్రబాబు డబ్బులు దండుకొనేందుకే ఇలా చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామన్నారు.












Click it and Unblock the Notifications