ప్రత్యేక హోదా: చంద్రబాబు, జగన్ వ్యూహాలేమిటి?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఒక్కరే నీళ్లు నమలకుండా మాట్లాడుతున్నారనిపిస్తోంది. ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆయన చెప్పారు. చంద్రబాబుకు తెలుసుననే విషయంలో సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని తెలిసిపోతూనే ఉంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా, అంటే తెలుసుననే అనుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదనే విషయం ఇప్పటికే చాలా సార్లు తేలిపోయింది. కొత్తగా తేలాల్సింది ఏమీ లేదు. బంద్లు, ఆందోళనలతో కూడా ప్రత్యేక హోదా సాధించలేని వాతావరణమే ఉంది.
జగన్కు కాంగ్రెస్ జత, బాబు వ్యూహం: ఆత్మరక్షణలో బీజేపీ
కొండ ప్రాంత రాష్ట్రాలకు తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాధ్యం కాదనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభ సాక్షిగా చెప్పారు. ఉత్తరాఖండ్ కొండల ప్రాంతం కాబట్టి ప్రత్యేక హోదా సాధ్యమైందని కూడా చెప్పారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదనేది తేలిపోయింది. అయితే, ఆందోళనల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ కాంగ్రెసు పార్టీ గానీ దాన్ని సాధించగలుగుతుందా అనేది ప్రశ్న.
ప్రత్యేక హోదా అంశం దాదాపుగా చల్లారిపోయిన స్థితిలో కెవిపి రామచందర్ రావు ప్రైవేట్ సభ్యుడి బిల్లును ప్రతిపాదించి అగ్గి రాజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టికొట్టుకుపోయిన కాంగ్రెసు పార్టీ అది కాస్తా జీవం పోసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి ప్రాణం పోసుకోవడానికి అది సంజీవినిలా పనిచేసింది. ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న చంద్రబాబుకు పరిస్థితి ఎదురు తిరిగే పరిస్థితిని కల్పించింది.
చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి వైయస్ జగన్ వద్ద మిగిలిన ఒకే ఒక అస్త్రం ఇప్పుడు ప్రత్యేక హోదా. దానితో ఆయన రాజకీయంగా చంద్రబాబును చిక్కుల్లో పడేసి తన పట్టును కోల్పోకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించాలని పన్నిన బిజెపి వ్యూహాలకు ఈ ఆందోళనలు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అయినా సరే, ప్రత్యేక హోదా విషయంలో దిగి రాకూడదనే పట్టుదలతోనే బిజెపి ఉంది.
'చంద్రబాబుకు కోపం రాదు, అలిగితే బీజేపీకి చుక్కలే'
ప్రత్యేక హోదా వల్ల సమకూరే ప్రయోజనాల కన్నా ఎక్కువే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేకూరుస్తుందని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. బిజెపి నాయకుల గొంతు ఇలాగే ఉంది. ప్రత్యేక హోదా అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెబుతూ వచ్చిన రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పుడు స్పష్టంగానే ప్రత్యేక హోదా అంశం ఇక లేదనే విషయాన్ని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో తనను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నిస్తున్నాయనే విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. దాంతో అందుకు అనుగుణంగానే చంద్రబాబు తన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. రాజ్యసభలోనూ వెలుపలా కేంద్రంపై దండెత్తిన రీతిలోనే వ్యవహరించారు. ఇది టిడిపికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చెప్పలేం గానీ తాము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని, ఈ విషయం రాజీ పడలేదనే సంకేతాలను టిడిపి ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేసింది.
అయితే, చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే, లేరనే చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకోవాలనే ప్రతిపక్షాల డిమాండ్కు టిడిపి సరికొత్త సమాధానాన్ని తెరపైకి తెచ్చింది. బిజెపితో విడిపోతే రావాల్సిన సాయం కూడా రాదనే వాదనను ముందుకు తెచ్చింది. ఈ వాదనకు టిడిపి ముందు ముందు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కొనసాగే అవకాశం ఉంది.