జూఎన్టీఆర్ సినిమాకి టాక్: డిక్టేటర్ కోసం బెదిరింపులా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతికి బాబాయ్ - అబ్బాయ్ మధ్య కోడిపందెంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓ వైపు చెబుతున్నప్పటికీ.. మరోవైపు పత్రికల్లో వీరిద్దరి విషయమై జోరుగా కథనాలు వస్తున్నాయి.
అందుకు ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో నిలవడమే కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా, నమస్తే తెలంగాణ పత్రికలో ఆసక్తికర కథనం వచ్చింది. సంక్రాంతి బరిలో నందమూరి పందెం.. అంటూ డిక్టెటర్ వర్సెస్ జూనియర్ అని కథనం వచ్చింది. ఇద్దరి సినిమాల వల్ల ఏపీలో సినీ రాజకీయం వేడెక్కిందని పేర్కొంది.
జూనియర్ ఎన్టీఆర్ పైన బాలయ్య క్యాంపు జులుం ప్రదర్శిస్తోందని, థియేటర్లకు బెదిరింపులు, డిక్టేటర్ వైపు మార్పులు జరిగిపోతున్నాయని అందులో పేర్కొంది. కథనం ప్రకారం... ఏపీలో ఈ సంక్రాంతి ఇద్దరు హీరోల మధ్య కోడిపందెంగా మారింది.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఎవరి సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేయాలనే అంశంలో పోటీ ఆసక్తికరంగానే మొదలైంది. దీనికి కాస్త రాజకీయకోణం కూడా ఉండటంతో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాజకీయవర్గాలు, సినిమా సర్కిళ్లలో ఈ పోటీ బాగా చర్చనీయాంశమవుతోంది.
ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన డిక్టేటర్ సినిమాను 14న విడుదల చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో... సినిమాను ఈనెల 13నే విడుదల చేయడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు.
సందట్లో సడేమియా టైపులో అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా కూడా 15న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు వరుసగా మూడు రోజులపాటు విడుదలయ్యే తీరు సహజంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని, అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది.
ఒకేసారి ముగ్గురు టాప్ హీరోల సినిమాలు విడుదలవుతున్నందున బాలకృష్ణ క్యాంపునకు ఆశించినన్ని థియేటర్లు దొరకలేదు. పైగా టాలీవుడ్ సర్కిళ్లలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో... విభిన్న కథాంశంతో బాగా వచ్చిందనే టాక్ బయల్దేరింది.
మరోవైపు డిక్టేటర్ సినిమా బాలకృష్ణ మార్కుతోనే ఉందని టాక్. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు థియేటర్ల యజమానులు కూడా పోటీ పడ్డారు. ఈ వేడిలో రాజకీయాలు కూడా ప్రవేశించాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా బదులు డిక్టేటర్ సినిమాను ప్రదర్శించాల్సిందిగా ఏపీలోని అనేక థియేటర్లకు బెదిరింపులు ఆరంభమయ్యాయి.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉండగా, మిగతా ఏపీ జిల్లాల్లో అక్కడక్కడా ఉంది. జూఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శించే థియేటర్ల యజమానుల వివరాలూ సేకరిస్తున్నారు. ఫోన్లు వెళ్తున్నాయి. దీనికితోడు బాలకృష్ణ శిబిరం యావత్తూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు నెగెటివ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సోషల్ మీడియాలోనూ ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు. దీంతో వేడి మరింత రాజుకుందని ఆ కథనం పేర్కొంది.