జోక్ అనుకున్నా: రాయల్స్ ప్లేయర్, ఫిక్సింగ్ కలకలం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8ను ఫిక్సింగ్ భయం వీడలేదు. ఐపీఎల్ 6ను ఫిక్సింగ్, బెట్టింగ్ ఓ కుదుపు కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తనను బుకీలు సంప్రదించారని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఓ సభ్యుడు బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
ఆటగాడి ఫిర్యాదుతో బీసీసీఐ యాంటీ కరప్షన్ సెల్ రంగంలోకి దిగింది. ఆటగాడిని రహస్యంగా విచారిస్తున్నారు. సదరు ఆటగాడు ఎవరనే విషయం మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.
శుక్రవారం నాడు ఐపీఎల్ 8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్కు ఒకరోజు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బాంబు పేల్చడం గమనార్హం. కాగా, అతను ముంబై బేస్డ్ క్రికెటర్గా తెలుస్తోంది. అతను బూకీ ఆఫర్ను తిరస్కరించాడు.
తనను కలిసింది కూడా క్రికెట్ వ్యక్తి అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అతను టీ20 లీగ్లలో లేడని సదరు ఆటగాడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫిక్సింగ్కు పాల్పడమని అతను తొలుత చెప్పడంతో తాను జోక్ చేస్తున్నాడని భావించానని, కానీ ఆ తర్వాత అది సీరియస్ అని తెలిసిందని విచారణాధికారులకు ఆటగాడు చెప్పాడని తెలుస్తోంది. తాను అతనితో కలిసి రంజీ ట్రోఫీలో డ్రెస్సింగ్ రూపం పంచుకున్నానని ఆటగాడు చెప్పినట్లుగా తెలుస్తోంది.