చూడండి! అదీ అసహనం: రాజ్నాథ్ ఘాటు కౌంటర్
న్యూఢిల్లీ: అసహనం పైన కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్లోనే సహనం ఎక్కువ అన్నారు. దాద్రీ ఘటన, కల్బుర్గీ హత్య కేసులో సిబిఐ దర్యాఫ్తుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. అసహనంపై లోకసభలో మంగళవారం చర్చ జరిగింది.
దేశ విభజన, ఇందిరా గాంధీ అత్యయిక స్థితి విధించినప్పుడు, సిక్కుల ఊచకోతలే అతిపెద్ద అసహన ఘటనలు అని రాజ్నాథ్ ధీటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి అసహనమే ఉందనుకుంటే అది అవినీతి, అక్రమాలు, ఉగ్రవాదం పైనే అన్నారు. అసహనానికి నష్టపోయిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీయే అన్నారు.
మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. నా పక్షాన, ప్రధాని మోడీ పక్షాన సభకు హామీ ఇస్తున్నానని, సామాజిక, మతపరమైన సామరస్యతను దెబ్బతీస్తే, ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.

ప్రజలు, ఎంపీలందరినీ వేడుకుంటున్నానని, దేశంలో సహనస్ఫూర్తిని రగిలించేందుకు చేతులు కలుపుదామన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ సింగ్ దానికి దీటుగా సమాధానమిచ్చారు.
దేశంలో సామరస్యతను దెబ్బతీసే ఏ ఒక్కర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఎన్డీయే పాలనలో దేశంలో అసహనం పెరిపోతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను తోసిపుచ్చారు. రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు వ్యక్తపరచిన ఆందోళనలపై చర్చిస్తామని, పురస్కారాలను వెనక్కిచ్చినవారు తిరిగి తీసుకోవాలని అభ్యర్థించారు.
అసహన ఘటనలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు రాజ్నాథ్ బదులిస్తూ... గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ప్రధాని స్పందించారని ఎదురు ప్రశ్నించారు. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటం మంత్రిగా తన బాధ్యత, తాను స్పందిస్తూనే ఉన్నానన్నారు.
దాద్రీలో ముస్లిం వ్యక్తి హత్యపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా, సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రచయిత కల్బుర్గీ హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం కోరితే, అందుక్కూడా కేంద్రం సిద్ధమన్నారు.
అవార్డులను తిరిగి ఇచ్చిన 39 మందిలో కొందరు లోకసభ ఎన్నికలకు ముందు... మోడీ లాంటి వ్యక్తి దేశాన్ని పాలించలేరు, పాలించకూడదని వ్యాఖ్యానించారనీ, దానినే అసహనం అంటారని చురక వేశారు. ఆయన మాట్లాడుతుండగానే కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు.
వారి వాకౌట్ను ఉద్దేశించి... వారు చెప్పిందంతా ఓపిగ్గా విని, సమాధానమిస్తుంటే, వినడానికి వారికి సహనం లేకపోయిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలపై వేధింపులు ఎక్కువవుతున్నాయన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ముస్లిం దేశాల్లో వారిలోని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రస్తావించారు.
వారితో పాటు సీపీఐ ఎంపీ మహమ్మద్ సలీంను ఉద్దేశించి రాజ్నాథ్ మాట్లాడుతూ... దేశంలో మూడు అతిపెద్ద అసహన సంఘటనలు చోటుచేసుకున్నాయని... ఒకటి దేశవిభజన, రెండోది నాటి ప్రధాని ఇందిర విధించిన అత్యయక పరిస్థితి, మూడోది 1984లో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లు అన్నారు.
ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరను అభినందించినవారు ఇప్పుడు మాకు సహనం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. సౌదీ గజిట్ సహా పలు పత్రికలు ప్రచురించిన కథనాలను ఆయన సభకు చూపుతూ సహనం ఉచ్ఛస్థాయిలో ఉన్నది ఒక్క భారత్లోనేనని, దేశంలో సామరస్యతను దెబ్బతీయాలని ఎవరైనా చూస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.












Click it and Unblock the Notifications