ఏడేళ్ల కిందటి చేదులా..!: చిదంబరాన్ని గుర్తు తెచ్చిన జైట్లీ
అమరావతి: నిన్నటి దాకా ప్రత్యేక హోదా.. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ పైన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం తీరు పైన ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఏం ఇస్తుందోనని అర్ధరాత్రి వరకు ప్రజలు ఆశగా ఎదురు చూశారు.
కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాత్రి పదకొండు గంటలకు చేసిన ప్రకటనతో అందరూ నిరుత్సాహపడ్డారు. జైట్లీ కొత్తగా చెప్పినవి ఏమీ లేవంటున్నారు. గతంలో పలుమార్లు చెప్పిన వాటినే ఆయన మళ్లీ చెప్పారని అంటున్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
పరిశ్రమలకు పన్ను రాయితీలు, కొత్త రైల్వే జోన్, రాజధానికి ఆర్థిక సాయం, ఇండస్ట్రియల్ కారిడార్, ఆర్థిక లోటును పూడ్చేందుకు నిధుల కేటాయింపు వంటి హామీల పైన విస్తృత చర్చలు జరిగాయి. మధ్యాహ్నం నుంచే ఏ క్షణమైన ప్రకటన చేసే అవకాశముందని ఎదురు చూశారు.

నాడు విభజనపై చిదంబరం, నేడు సాయంపై జైట్లీ
కానీ ఆలస్యమైన కొద్ది విభజన రోజు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఏడేళ్ల క్రితం 2009 డిసెంబర్ 9వ తేదీన రాత్రి పదకొండు గంటలకు నాటి కేంద్రమంత్రి చిదంబరం రాష్ట్ర విభజన ప్రకటన చేశారు. నేడు ఆర్థిక మంత్రి జైట్లీ కూడా హామీలపై దాదాపు అదే సమయానికి మాట్లాడారు. నాడు విభజన ప్రకటనతో షాకిస్తే, నేడు సాయం చేస్తామని చెప్పి.. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారని అంటున్నారు.

టిడిపి ఆచితూచి
జైట్లీ ప్రకటన పైన కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. చంద్రబాబు కూడా జైట్లీ ప్రకటనను స్వాగతించారు. అయితే, తమకు హోదా ముఖ్యమని తేల్చి చెప్పారు. రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్రంతో చెడితో మొదటికే మోసమని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీంతో ఆచితూచి స్పందిస్తున్నారు. గురువారం నాడు ప్యాకేజీకి సంబంధించిన వివరాలను నెట్లో పెడతామని కేంద్రం చెప్పింది. దానిని చూశాక, పూర్తి స్పష్టత వస్తుందని అప్పుడు స్పందిద్దామని అంటున్నారు.

విపక్షాల ఆగ్రహం
కేంద్ర ప్రకటన పైన విపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలన్నీ కేంద్రం తీరును తప్పుబట్టాయి. అసలు అరుణ్ జైట్లీ ప్రకటనలో కొత్త ఏముందో చెప్పాలన్నారు. పాడిందే పాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

రూ.లక్షన్నర కోట్ల సాయం
కేంద్రం లక్షన్నర కోట్ల సాయం చేయనుందని తెలుస్తోంది. పోలవరం బాధ్యతను పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. దీని విలువ రూ.32 వేల కోట్లు. రెవెన్యూ లోటు భర్తీకి రూ.10వేల కోట్లు ఇవ్వనుంది. ఈ ఏపీ రుణంతో రూ.30వేల కోట్లు రానున్నాయి. రాజధాని అమరావతికి రూ.10వేల కోట్లు ఇస్తారు. మౌలిక సౌకర్యాలకు మరో రూ.25వేల కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు రూ.2వేల కోట్లు, కారిడార్కు రూ.12వేల కోట్లు, ఓడరేవులకు రూ.20వేల కోట్లు ఇవ్వనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications