సినిమా 'ఎర్ర' దొంగ: నీతుతో మస్తాన్ వలీ మూడో పెళ్లి?
హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో సినీరంగం వారు కూడా ఉన్నట్లుగా వెలుగు చూస్తోంది. సినీ నిర్మాతలు, చిన్న హీరోలు.. చివరకి హీరోయిన్ కూడా ఎర్ర చందనం కేసులో ఉండటం గమనార్హం. టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు ఎర్ర చందనం స్మగ్లింగ్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినీ నటి రీతూ అగర్వాల్ పైన కర్నూలు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది.
స్మగ్లింగ్లో ఆరితేరిన మస్తాన్ వలీ ఎర్ర చందనంలో కోట్లాది రూపాయలు సంపాదించి ఆ సొమ్ముతో సినిమా తీశాడు. ఆ తర్వాత అదే హీరోయిన్తో సహజీవనం చేశాడు. మస్తాన్ వలీ 2013లో ప్రేమ ప్రయాణం అనే సినిమా తీశాడు. అందులో హీరోయిన్గా నటించిన రీతూ అగర్వాల్తో సహజీవనం ప్రారంభించాడు. అనంతరం ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు.
రీతూ ఆగర్వాల్కు మస్తాన్ వలీ రూ.35 లక్షల విలువైన ఓ ఫ్లాట్ను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ - నీతూ అగర్వాల్ అకౌంట్ల మధ్య ఆర్థిక లావాదేవలు జరిగినట్లుగా వెల్లడైంది. ఇప్పటికే మస్తాన్ వలీ, ఆయన సోదరుడు ఎర్రచందనం కేసులో అరెస్టయ్యారు. రీతూ అగర్వాల్ పైన రుద్రవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఆమె ముంబై లేదా బెంగళూరులలో ఉండవచ్చునని భావిస్తున్నారు.
నీతు బ్యాంకు ఖాతాల నుండి మస్తాన్ వలీ ఇతర స్మగ్లర్లకు నిధులు బదలీ చేసినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలిందని తెలుస్తోంది. దీంతో ఆమె బ్యాంకు ఖాతాల పైన నిఘా పెట్టగా ఆ ఖాతాలో నగదు నిల్వ లేనట్లు గుర్తించారని సమాచారం. మస్తాన్ వలీ అనుచరుడు శంకర్ నాయక్కు నీతూ అగర్వాల్ ఖాతా నుండి నగదు బదలీ చేసినట్లుగా గుర్తించారు.
ఎర్రచందనం కేసులో వీరితో పాటు చెన్నై సినీ నిర్మాతలు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిర్మాతలు ఎర్ర చందనం స్మగ్లింగ్ను తమ వృత్తిగా చేసుకున్నారంటున్నారు. తమిళనాడుకు చెందిన చిన్న హీరోకు కూడా ఈ స్మగ్లింగ్లో పాత్ర ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు తమిళనాడుకు చెందిన ప్రధాన పార్టీకి చెందిన ముఖ్యనేత కూడా ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications