తిరస్కరిస్తే దేశద్రోహమే?: రూ.10నాణేనికి ఎందుకీ పరిస్థితి?, అసలు నిజాలివి..
హైదరాబాద్: ఈమధ్య చాలా దుకాణాల్లో.. ప్రైవేటు వాహనాల్లో.. ఆఖరికి బ్యాంకుల్లోను రూ.10నాణెం ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో ఆ నాణెం చెల్లట్లేదన్న ప్రచారం జోరందుకుంది. ఆర్బీఐ విడుదల చేసిన ఒక నాణెం.. ఆ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండా చెల్లకుండా ఎలా పోతుంది?.. ఇదంతా వట్టి బోగస్ ప్రచారమేనా?..
ఈ ప్రచారం వెనుక పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కొన్ని కారణాల వల్ల బ్యాంకులు వాటిని తిరస్కరిస్తుండటంతో.. జనాల్లో ఈ నాణేలు చెల్లట్లేదన్న వదంతులు వ్యాపించాయి. దీంతో ఎవరైనా రూ.10నాణెం ఇస్తే.. తీసుకునేది లేదని కొంతమంది వ్యాపారులు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి:
బ్యాంకుల స్ట్రాంగ్ రూమ్స్ డీమానిటైజేషన్ సొమ్ముతో నిండిపోయి ఉండటంతో చిల్లర నాణేలు పెట్టుకొనేందుకు చోటు లేదని బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అనధికారికంగా వినిపిస్తోన్న వాదన. దీనికి తోడు నకిలీ కాయిన్ల బెడద కూడా వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆ విషయాన్ని బయటపెడితే.. రూ.10నాణేల చలామణి మొత్తం సంక్షోభంలో పడుతుంది కాబట్టి బ్యాంకులు కూడా ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు.
పోగుబడుతున్న కాయిన్లు:
బ్యాంకులు రూ.10నాణేలను తిరస్కరిస్తుండటంతో షాపులు, పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున కాయిన్లు పోగుబడుతున్నాయి. ఒక్కో బంకులో రోజుకు రూ.4 వేల విలువైన కాయిన్లు వచ్చిపడుతున్నట్లు గుర్తించారు. చిల్లర మొత్తాన్ని బ్యాంకులకు తీసుకెళ్తే అక్కడ వాటిని తిరస్కరిస్తున్న పరిస్థితి. దీంతో అంత చిల్లరను ఏం చేయాలో వారికీ అర్థం కావడం లేదు. ఈ పరిస్థితి వల్లే రూ.10నాణేన్ని వారు తిరస్కరిస్తున్నారు.
ఇప్పటికే ఉన్న చిల్లర భారీగా పోగుబడి ఉండటంతో రూ.10నాణేన్ని తీసుకోవడానికి వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, చిన్న చిన్న వ్యాపారులు, బంకులు.. ఇలా ప్రతీచోట రూ.10నాణెం తిరస్కరణకు గురవుతుండటంతో ఆ నాణేలను నిషేధించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆర్బీఐ ఏం చెప్పింది:
రూ.10నాణేలు నకిలీవంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ లను నమ్మవద్దని ఆర్బీఐ చెబుతోంది. రూ.10 కాయిన్లు ముద్రిస్తున్న పదేళ్ల కాలం నుంచి రకరకాల డిజైన్లు వచ్చినట్లు చెబుతోంది. 2011లో రూపీ సింబల్ వచ్చిందని, అంతకుముందున్న డిజైన్లు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు రూ.10వేల వరకు పది రూపాయల కాయిన్లను ఒక కస్టమర్ ఒకేసారి బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకర్ తిరస్కరించడం కుదరదని తేల్చి చెప్పింది.
Recommended Video
అలా చేయడం దేశద్రోహమే:
ఒకవేళ ఎవరైనా వ్యాపారి లేదా బ్యాంకు రూ.10నాణేన్ని తీసుకోవడానికి తిరస్కరిస్తే.. అది దేశద్రోహం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రూ.10నాణేన్ని తిరస్కరించిన రుజువు ఉంటే సదరు వ్యాపారిపై ఐపీసీ 124(ఎ) సెక్షన్ నిబంధన కింద కేసు పెట్టవచ్చునని అంటున్నారు. మధ్యప్రదేశ్ లో రూ.10నాణెం తిరస్కరించిన ఓ వ్యాపారిపై ఐపీసీ 188కంది కేసు నమోదు చేశారు.
నకిలీలు ఉన్నా ప్రభావం ఉండదు:
ఢిల్లీ, బెంగాల్ మాల్దా జిల్లాలో భారీఎత్తున నకిలీ రూ.10 కాయిన్ల తయారీ బయటపడటంతో వీటిని తీసుకునేందుకు చాలామంది తిరస్కరిస్తున్నారు. అయితే ఆ నకిలీ యూనిట్లు దొరికిపోయే లోగా తయారుచేసే నాణేల సంఖ్య అతి స్వల్పమని ఆర్బీఐ చెబుతోంది. అది ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం ప్రభావితం చేయబోదని స్పష్టం చేస్తోంది.