మీరే: మోడీ 'క్లీన్ ఇండియా'పై మహిళలకు సచిన్
నెల్లూరు: రాజ్యసభ సభ్యులు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారికండ్రిగలో ఆదివారం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పైన మహిళలకు అగగాహన కల్పించారు.
పుట్టంరాజువారికండ్రిగ చేరుకున్న సచిన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంగన్ వాడీ మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. దేశానికి మహిళలే వెన్నెముక అన్నారు. కుటుంబంలో మహిళలు బాగుంటే పిల్లలు బాగుంటారని చెప్పారు.
మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పారు. పిల్ల ఆరోగ్యం పైన మహిళలు బాధ్యతగా మెలగాలని చెప్పారు. అంగన్ వాడి మహిళలతో ముచ్చటించిన సచిన్ వారికి పలు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్, పరిశుభ్రత పైన మహిళలకు వివరించారు.
అక్కడి స్వయం సకహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో మహిళ పాత్రపై మాట్లాడారు. తనకు ప్రభుత్వం అందజేసిన భారతరత్నను మహిళామూర్తులకే అంకితమిస్తున్నట్లు సచిన్ ప్రకటించారు.
గ్రామం అభివృద్ధిలో భాగంగా మహిళలు కీలక భూమిక పోషించాలన్నారు. మరుగుదొడ్లను నిర్మించుకోవడమే కాక వాటిని సక్రమంగా నిర్వహించుకునే విషయంలోనూ మెళకువలను నేర్చుకోవాలని ఆయన సూచించారు. కాగా, సచిన్ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలి వచ్చారు.