శివ్పాల్ సెక్యులర్ మోర్చా: తండ్రీ తనయుల మధ్య తంపులు పెడతారా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో ఊహించిన పరిణామం చోటు చేసుకున్నది. నేతాజీగా అందరి మన్ననలు పొందిన ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివ్పాల్ సింగ్ యాదవ్..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో ఊహించిన పరిణామం చోటు చేసుకున్నది. నేతాజీగా అందరి మన్ననలు పొందిన ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివ్పాల్ సింగ్ యాదవ్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎస్పీని కాపాడుకునేందుకు సమాజ్ వాదీ సెక్యులర్మోర్చాను స్థాపించారు. దానికి అధినేతగా ములాయం సింగ్ యాదవ్ ఉంటారని ప్రకటించారు. తద్వారా శివ్పాల్.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు ప్రత్యర్థిగా తన సోదరుడైన అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 - 17 మధ్య సీఎం పనిచేసిన కాలంలో అఖిలేశ్ - శివ్పాల్ మధ్య సంబంధాలు ఉప్పూనిప్పూగా ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు.
శివ్ పాల్ యాదవ్ సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా ఏర్పాటు చేయడంతో ఎస్పీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం మరో దశ తిరుగుతుందా? అన్న సంకేతాలు చూపుతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 47 స్థానాలకు పరిమితం కావడంతో ఆ పార్టీ అధినాయకత్వాన్ని అందుకున్న అఖిలేశ్ యాదవ్పై పార్టీలో దానికి మించి ములాయం కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి. మూడు దశాబ్దాల క్రితం సమాజ్ వాదీ పార్టీని స్థాపించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన ములాయం స్థానే పార్టీపై పట్టు సాధించేందుకు మాత్రమే శివ్పాల్ యాదవ్.. సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా స్థాపించారన్న సంగతి అంతా భావిస్తున్నారు. తద్వారా ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని అందుకునేందుకు అబ్బాయ్తో బాబాయి పోటీ పడుతున్నారని పరిణామాలు చెప్తున్నాయి.
అఖిలేశ్ను సీఎంగా చేయడంతోనే షురూ..
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ఆయనలో తన రాజకీయ వారసుడిని నియమించాలన్న అంశంపై ఆలోచన మొదలైంది. అదే ఆలోచన పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు పునాదిగా మారింది. 2012కి ముందు వరకు ములాయం వెన్నంటి వచ్చిన శివ్ పాల్ యాదవ్ అన్న అడుగు జాడల్లో ముందుకు సాగారు. అదే ఏడాది మాయావతి ప్రభుత్వాన్ని సాగనంపిన తర్వాత అఖిలేశ్ యాదవ్ను సీఎంగా నియమిస్తానని ములాయం ప్రకటించడంతో యుద్ధానికి ప్రాతిపదికగా మారింది. అప్పటి వరకు పార్టీ తరఫున లోక్సభ సభ్యుడిగా ఉన్న అఖిలేశ్ యాదవ్ను సీఎంగా నియమించారు. కానీ అప్పటివరకు బాబాయ్ శివ్పాల్ యాదవ్కు మాత్రం అన్న కొడుకు సారథ్యంలో పని చేయడం సుతారామూ ఇష్టం లేకపోయినా కుదరలేదు. ఈ విషయంపైనే పలు దఫాలు ములాయం కుటుంబం సమావేశమై చర్చోపచర్చలు సాగించినా ములాయం వెనక్కు తగ్గలేదు. తత్ఫలితంగా శివ్ పాల్ యాదవ్ వ్యూహాత్మకంగా ఒక వెనుకడుగు వేశారు. అఖిలేశ్ యాదవ్ దేశంలోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఒకప్పుడు పార్టీలో శక్తిమంతమైన నేతగా ఉన్న తన చిన్న నాటి గురువు శివ్పాల్ యాదవ్ను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య మూడేళ్ల పాటు పాలనా, పార్టీ వ్యవహారాల్లో ఉద్రిక్తతల మధ్యే సాగాయి.
అఖిలేశ్పై శివ్పాల్ ఇలా
2015 డిసెంబర్లో తొలిసారి శివ్పాల్, అఖిలేశ్ యాదవ్ మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు బయటపడ్డాయి. బాబాయి శివ్ పాల్, తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సఫాయి ఫెస్టివల్'కు గైర్హాజరు కావడమే దీనికి ప్రాతిపదికగా మారింది. తన మద్దతుదారులుగా ఉన్న ఆనంద్ భాదౌరియా, సునిల్ యాదవ్ ‘సజ్జన్', సుబోధ్ యాదవ్ లను ఎస్పీ యూపీ శాఖ అధ్యక్షుడిగా శివ్ పాల్ యాదవ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగానే అఖిలేశ్ యాదవ్ ‘సఫాయి' ఉత్సవానికి డుమ్మా కొట్టారు. సదరు ముగ్గురు నేతలను పార్టీలో కొనసాగిస్తామని శివ్ పాల్ ప్రకటించడంతో బాబాయ్ - అబ్బాయ్ మధ్య తొలి రాజీ కుదిరినా మూడు నెలలకే 2016 మార్చిలో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ములాయం చిన్న కోడలు అపర్ణయాదవ్ను పార్టీ రాజకీయాల్లోకి తేవాలన్న శివ్ పాల్ యాదవ్ ప్రతిపాదనను అఖిలేశ్ తిరస్కరించడంతో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
అమర్సింగ్ పునరాగమనంలోనూ శివ్పాల్ కీలకం
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ ఎస్పీలోకి పునరాగమనం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీసింది. 2016 మేలో అమర్సింగ్ను తీసుకురావడంతోపాటు.. అందుకు అఖిలేశ్ యాదవ్తో బలవంతంగా ఒప్పించడంలోనూ శివ్పాల్ క్రియాశీల పాత్ర పోషించారు. మరో నెల రోజులకే ఖ్వామీ ఎక్తాదళ్ (క్యూఈడీ)ని ఎస్పీలో విలీన ప్రతిపాదన తీసుకొచ్చారు. అందుకోసం ములాయంసింగ్ యాదవ్కు నచ్చజెప్పి, ఒప్పించారు. కానీ అఖిలేశ్ యాదవ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి తిరగబడింది.
శివ్పాల్ మంత్రి పదవి హుష్కాకి
అసెంబ్లీ ఎన్నికలు శరవేగంగా దూసుకువస్తుండటంతో శివ్పాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ మధ్య ‘వారసత్వం కోసం పోరాటం' అంతే వేగంగా పెరుగుతూ వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ వారసత్వ బాధ్యతలను వదులుకునేందుకు సిద్ధమవుతున్న వేళ అబ్బాయ్ - బాబాయ్ మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎస్పీ యూపీశాఖ అధినేతగా శివ్పాల్ యాదవ్ తన అధికారాలకు పదును పెట్టారు. అఖిలేశ్, శివ్పాల్ మధ్య పరస్పరం ఘర్షణ సాగుతూనే ఉన్నది. అఖిలేశ్ యాదవ్ పదేపదే శివ్పాల్ యాదవ్ మద్దతుదారులైన మంత్రులను పదేదపే తొలగించారు. శివ్పాల్ మంత్రి పదవిని తొలగించేందుకు వెనుకాడలేదు. పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్ను ములాయం సింగ్ యాదవ్ సస్పెండ్ చేయడంతో అంతర్గత సంక్షోభం పతాకస్థాయికి చేరుకున్నది. కానీ ములాయం తన మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఎస్పీలో చీలికకు పూర్తిగా బీజం పడింది.