ముచ్చటగా మూడే: చంద్రబాబుకు మోడీ 'స్మార్ట్' షాక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో షాకిచ్చిన కేంద్రం.. స్మార్ట్ సిటీల విషయంలోను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అసంతృప్తికి గురి చేసినట్లుగా చెబుతున్నారు. స్మార్ట్ సిటీల విషయంలో చంద్రబాబు ఒకటి తలస్తే, మరొకటి అయిందని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా రానందున.. స్మార్ట్ సిటీలు, ప్రత్యేక ప్యాకేజీలతో చంద్రబాబు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రాబట్టాలని భావించారు. కానీ కేంద్రం మాత్రం ఆయనకు షాకిచ్చిందని చెప్పవచ్చు. విభజన అనంతరం ఏపీ ఆర్థిక కష్టాల్లో పడింది. అలాంటి ఏపీకి కేంద్రం నుంచి సాయం కావాలని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నారు.
విభజన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు... రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చెప్పారు. 14 స్మార్ట్ నగరాలకు అదనంగా మూడు మెగా సిటీలను నిర్మిస్తామనీ ప్రభుత్వం చెప్పింది.
అయితే, గురువారం నాడు విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో ఏపీ నుంచి కేవలం మూడు నగరాలు మాత్రమే ఉన్నాయి. జిల్లాకో స్మార్ట్ సిటీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ కేంద్రం మాత్రం మూడే ఇవ్వడం గమనార్హం. ఏపీలోని స్మార్ట్ సిటీల లిస్టులో తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఉన్నాయి.
స్మార్ట్ సిటీల కోసం మిగతా 11 నగరాల ఊసెత్తకపోవడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఇలా వ్యవహరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కేంద్రానికి పంపే ప్రతిపాదనలలో చంద్రబాబు మిగతా నగరాలను పేర్కొనలేదా తెలియాల్సి ఉంది.
కాగా, దేశంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా నేరుగా లబ్ధి పొందే ప్రజలు 12 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రతిపాదిత 98 స్మార్ట్ సిటీల మొత్తం జనాభా 12 కోట్ల మంది అని, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పట్టణ ప్రాంత జనాభాలో ఇది 35 శాతం అని గురువారం స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు చెప్పారు.
ఈ ప్రాజెక్టు కింద ఎంపికయిన నగరాల వివరాలను గమనించినట్లయితే 35 నగరాలు, పట్టణాలలో ఒక లక్షల నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉండగా, అయిదు లక్షలనుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు 21 ఉన్నాయి.
పది లక్షలకు పైబడి, 25 లక్షలలోపు జనాభా ఉన్న నగరాలు 25 ఉండగా, అయిదు నగరాల్లో 25 నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉంది. నాలుగు నగరాలు చెన్నై, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ ముంబయి, అహ్మదాబాద్లలో 50 లక్షలకు పైబడి జనాభా ఉంది.
స్మార్ట్ సిటీలకోసం ఎపికయిన మొత్తం 98 నగరాల్లో 24 నగరాలు రాజధాని నగరాలు. మరో 24 వాణిజ్య, పారిశ్రామిక నగరాలు. 18 నగరాలు సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యత ఉన్న నగరాలు.అయిదు నగరాలు రేవు పట్టణాలు. మూడు నగరాలు విద్యా, ఆరోగ్య కేంద్రాలు. ఒక లక్ష అంతకన్నా తక్కువ జనాభా కలిగి ఉన్నప్పటికీ జాబితాలో చోటు సంపాదించుకున్న పట్టణాల్లో అరుణాచల్ ప్రదేశ్లోని సిల్వస్సా, దియు, కవరట్టి, పసిగాట్, సిక్కిమ్లోని నమ్చి ఉన్నాయి.