దీపావళి: ఉద్యోగులకు కార్లు, ఇళ్లు ఇచ్చిన వ్యాపారి
సూరత్: ఉద్యోగులకు రెండు పడకగదుల ఇళ్లను, ఆభరణాలను, కార్లను దీపావళి కానుకలుగా ఇచ్చి దేశవ్యాప్తంగా ఆకర్షించిన సూరత్ వజ్రాల వ్యాపారి సావ్జీ భాయ్ దోలాఖియా.. సంపదను పంచుకోవడం వల్ల అది ఎన్నటికీ తరిగిపోదని చెప్పారు. ప్రతిసారి తాను ఇచ్చిన దాని కంటే ఎక్కువే పొందానని చెప్పారు.
ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని నేను, నా ముగ్గురు సోదరులం కలిసి1991లో వజ్రాల ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించామని, రూ.100 కోట్లతో మొదలైన కంపెనీ టర్నోవర్ ఇప్పుడు రూ.6,000 కోట్లకు చేరిందన్నారు.
ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను ఇవ్వడం గురించి చెబుతూ.. వారి విశ్వసనీయతకు, కఠిన పరిశ్రమకు గుర్తింపుగా ఈ కానుకలు ఇచ్చామని, అదేమంత పెద్దది కాదన్నారు. సంపదను పంచుకోవడం వల్ల ఎన్నటికీ తరగదన్నారు. ఇది తాను జీవితంలో నేర్చుకన్న సత్యమని చెప్పారు.

తమ కంపెనీలో మొత్తం ఆరువేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, బహుమతుల కోసం వీరిలోనుండి 1,200 మందిని ఎంపిక చేశామని అతను తెలిపారు. 25 అంశాలతో కూడిన ఒక జాబితా ఆధారంగా వీరిని ఎంపిక చేశామన్నారు. వాళ్లు వజ్రాలను సానబెడుతుంటారని, కానీ వారే తమ నిజమైన వజ్రాలు అన్నారు.
కాగా, సావ్జీబాయ్ పెద్దగా చదువుకోలేదు. పైగా స్కూల్లో డ్రాపవుట్ చరిత్ర. పేరుగాంచిన వజ్రాల వ్యాపారి. ఇతను దీపావళి సందర్భంగా తన సిబ్బందికి వజ్రాలు, కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చి తన సిబ్బందితో పాటు దేశ ప్రజల్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు.
1991లో తన ముగ్గురు సోదరులతో హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ పేరుమీద వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. వీరిలో ఏ ఒక్కరూ పాఠశాల విద్య పూర్తి చేయలేదు. పెద్దగా చదువుకోలేదని, కానీ ఎంతో చదివానని, స్వయంకృషితో తనను తాను తీర్చిదిద్దుకున్నానని, నేను చేసింది, నా చేతుల్లో ఉన్నదీ అదే అని చెప్పారు.
తన వ్యాపారం ఈ స్థాయికి ఎదగడానికి తన సిబ్బందిలోని చిత్తశుద్ధి, అంకితభావం, కష్టించి పనిచేయాలనే గుణమే కారణమన్నారు. వారికి ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు. ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవడమంటే యజమాని సంపద తరిగిపోతుందనే భావనకు తాను విరుద్ధమన్నారు. ఈ వ్యాపారి 207మంది ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లు, 491మందికి కార్లు, 500మందికి వజ్రాలు బహూకరించారు.












Click it and Unblock the Notifications