మహారాష్ట్ర: ఫడ్నవీస్కు ఉద్ధవ్ థాకరే షాక్ ఇస్తారా?
ముంబై: మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే షాక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపికి, శివసేనకు మధ్య ప్రభుత్వ ఏర్పాటులో విభేదాలు బుధవారంనాడు కూడా కొనసాగుతున్నాయి. ఈ స్థితిలో శివసేన ప్రభుత్వంలో చేరేందుకు విముఖత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తమకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది. ఆ పదవి ఇవ్వకపోతే ప్రభుత్వంలో చేరకూడదని, దానికితోడు విశ్వాస పరీక్షలో పాల్గొనకూడదని శివసేన అనుకుంటున్నట్లు సమాచారం.
గౌరవప్రదమైన ఆఫర్ ఇవ్వకపోతే ప్రతిపక్షంలో కూర్చోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే భావిస్తున్నారు. గత శుక్రవారం నుంచి ఇరు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నప్పటికీ అవి కొలిక్కి రాలేదు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకూడదని ఉద్ధవ్ థాకరే తొలుత అనుకున్నారు. కానీ బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా జోక్యంతో అయిష్టంగానే ఆ కార్యక్రమానికి వచ్చారు.

డిప్యూటీ సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గకూడదనే నిశ్చయంతో శివసేన ఉంది. మంత్రిత్వ శాఖల విషయంలో సర్దుబాటుకు తాము సిద్ధంగానే ఉన్నామని, డిప్యూటీ సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గబోమని శివసేన నాయకులు అంటున్నారు. గత పదిహేనేళ్ల సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెసు, ఎన్సీపిలు ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం పదవులను పంచుకున్నాయి. కానీ ఆ సంప్రదాయాన్ని పాటించడానికి బిజెపి సిద్ధంగా లేదు.
మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉండగా, బిజెపి 121 సీట్లు గెలుచుకుంది. మెజారిటీ లేకపోవడంతో శివసేన మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బలపరీక్ష సమయంలో శివసేన కొలికి పెడితే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యమైన మంత్రిత్వ శాఖల విషయంలో కూడా బిజెపి, శివసేన మధ్య విభేదాలు పెరిగాయి. ముఖ్యమైన హోం, ఆర్థిక, రెవెన్యూ, పట్టణాభివృద్ధి శాఖలను ఇప్పటికే బిజెపి మంత్రులకు కేటాయించారు. దాంతో శివసేనకు ఆ శాఖలు దక్కే అవకాశం లేదు.
వారు ఏది ఇస్తే దాన్ని తీసుకోవాలనే పద్ధతిలో బిజెపి వ్యవహరిస్తోందని శివసేన గుర్రుమంటోంది. లోకసభలో తమకు 18 మంది ఎంపీలుంటే కేవలం ఒక్క మంత్రి పదవే ఇచ్చారని, అది కూడా అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వ శాఖను ఇచ్చారని అంటోంది.












Click it and Unblock the Notifications