జగన్కు రాజ్యసభ భయం, వేమిరెడ్డితో బాబు వ్యూహం
హైదరాబాద్: త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో టిడిపి మూడు, వైసిపి ఒక సీటు గెలుచుకునే బలం ఆయా పార్టీలకు ఉన్నాయి. అయితే, నాలుగో స్థానాన్ని కూడా దక్కించుకునేందుకు టిడిపి పావులు కదుపుతోంది.
చంద్రబాబు పావులకు వైసిపి అధినేత జగన్ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. తద్వారా నాలుగో సీటును టిడిపికి దక్కకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఏపీలో ఓ విధంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు.
ఇప్పటిదాకా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల పాలకవర్గాల ఎన్నికలు, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, కాపాడుకోవడం... తదితర లక్ష్యాల కోసం ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలను నడిచాయి.

తాజాగా రాజ్యసభలో తన పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్యతో ఈజీగానే ఓ సీటును గెలుచుకునే బలం ఉన్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపులకు పంపించి రాజ్యసభ బరిలోనూ సరికొత్తగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారని అంటున్నారు.
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 67 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైసిపి నుంచి ఇప్పటికే 17 మంది సైకిల్ ఎక్కారు. మరికొందరు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిని జగన్ బరిలోకి దించారు.
36 మంది ఎమ్మెల్యేల బలంతోనే విజయసాయిని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ తన ఎమ్మెల్యేలు చేజారిపోతారోనన్న భయం జగన్కు పట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలకు క్యాంపులు ఏర్పాటు చేశారంటున్నారు.
ఆయా ఎమ్మెల్యేలను కుటుంబ సభ్యులతో సహా క్యాంపులకు తరలించిన జగన్ వారిలో కొందరిని గోవాకు, మరికొందరిని కేరళకు పంపించినట్లుగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అడిగింతే తడవుగా వారందరినీ జగన్ శ్రీలంకకు పంపారంటున్నారు. జగన్ క్యాంపు రాజకీయాలపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారంటున్నారు.
మరోవైపు, రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టిడిపి బరిలోకి నాలుగో అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. టిడిపి నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు బరిలో ఉంటారు. నాలుగో అభ్యర్థిని స్వతంత్రుడిగా రంగంలోకి తీసుకు వచ్చి వైసిపి అభ్యర్థికి పోటీగా నిలపాలన్నది బాబు వ్యూహం.
ముగ్గురు అభ్యర్థులు గెలిచేందుకు సరిపడా బలం టిడిపి, బీజేపీకి ఉంది. ఇటీవల వైసిపి నుంచి పదిహేడు మంది టిడిపిలో చేరారు. వీరిని నాలుగో అభ్యర్థికి కేటాయించాలనే నిర్ణయానికి టిడిపి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు మరో 17మంది బలం తోడైతేనే నాలుగో అభ్యర్థి గెలుస్తారు.
వైసిపి నుంచి మరికొందరు టిడిపిలోకి త్వరలో చేరడంగానీ, ఓటేసేందుకు సుముఖత చూపడం కానీ జరగవచ్చునని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించారని అంటున్నారు.
పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందంటున్నారు. ఈ స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేటాయించే అవకాశముంది. బిజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనతో మాట్లాడారని పొలిట్బ్యూరో సమావేశంలో చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.
టిడిపి నుంచి కేంద్రమంత్రి సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన రావు, జెఆర్ .పుష్పరాజ్, హేమలత, బిటి నాయుడు, బీద మస్తాన్రావు తదితరుల్లో ఇద్దరికి అవకాశం ఉంటుంది. సుజనా కొనసాగించే అవకాశం ఉంది. రెండో అభ్యర్థి హేమలత కానున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications