లోకేష్ విఫలం: టిలో టిడిపి ఖాళీ, లిస్ట్లో ఎమ్మెల్యే, 'గ్రేటర్' ఒకే ఒక్కడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోందా? సార్వత్రిక ఎన్నికల తర్వాత టిడిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా, గ్రేటర్ ఎన్నికలలో టిడిపి బాగా దెబ్బతిన్నదని మరోసారి అర్ధమైంది.
దీంతో, మిగతా కీలక నేతలు కూడా కారు ఎక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రూపంలో తొలి షాక్ తగిలింది. మరికొందరు కూడా ఆ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టిడిపి నుంచి టికెట్ పొంది విజయం సాధించిన ఒకే ఒక్క అభ్యర్థి, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఓ మంత్రి ద్వారా సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఆయన చేరవేశారని అంటున్నారు.
శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో, ఆయన తెరాసలో చేరడం లాంఛనమే అంటున్నారు. మరోవైపు, మంగళవారం నాడు కేసీఆర్ స్వయంగా కలవనున్న సందర్శకుల జాబితాలో టిడిపి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఆయన కూడా జంపింగ్ జాబితాలో ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు తదితర ఎందరో ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. ఇప్పుడు గ్రేటర్లో గెలిచిన ఒక్క కార్పోరేటర్ కూడా టిడిపిలో చేరితే ఆ పార్టీకి సున్నా ఉంటుంది. 2014 ఎన్నికల్లో బాగా బలంగా ఉన్న టిడిపి ఇప్పుడు ఏకంగా సున్నాకు చేరినట్లవుతుంది. చంద్రబాబు, నారా లోకేష్, రేవంత్ రెడ్డిలు జంపింగులను ఆపలేకపోతున్నారని అంటున్నారు.