నంద్యాల: జగన్ పార్టీ కాన్ఫిడెన్స్, అదే జరిగితే టీడీపీ గెలుపు ఖాయం!
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నికల పోలింగ్ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
కర్నూలు: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నికల పోలింగ్ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలపై రాష్టవ్య్రాప్తంగానే కాకుండా జాతీయ పార్టీలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నాయి. భారీ పోలింగ్ నమోదు కావడంతో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమదే గెలుపంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఇలా..
పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గంలో 79.2 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సుమా రు 84 శాతం, నంద్యాల పట్టణంలో 74 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో విజయం తమదేనని వైయస్సార్ కాంగ్రెస్ లెక్కలుకడుతోంది. కాగా టిడిపి సైతం పట్టణంలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ పోలింగ్ జరగడం లాభిస్తుందని అంచనా వేస్తోంది.
Recommended Video
టీడీపీ ధీమా ఇది..
గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చినా పట్టణంలోని ఆధిక్యతతో విజయం ఖాయమన్న అంచనాకు వస్తున్నారు. ఇరుపార్టీల నేతలు గ్రామాల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించడం ప్రారంభించారు. పట్టణంలో పలు వార్డుల్లో వైసీపీ పోలింగ్ నిర్వహణలో ఇబ్బందులు పడినట్లు తెలుస్తుండగా, దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు చర్చించుకుంటున్నారు.
కీలకంగా గోస్పాడు.. ఎవరికి వారే..
నంద్యాల పట్టణంలో 1.42 లక్షలమంది ఓటర్లు ఉండగా సుమారు 1.02 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 77 వేల ఓట్లు ఉండగా 65 వేల ఓట్లు పోలైనట్లు సమాచారం. అయితే నంద్యాల గ్రామీణ మండలంలో ఇరుపార్టీలకు సమానంగా ఉంటాయని, గోస్పాడు మండలంలో వైసీపీకి ఆధిక్యత లభించే అవకాశం ఉందని టిడిపి లెక్కలు వేస్తోంది. అయితే, పట్టణంలో వచ్చే మెజార్టీతో తాము విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. గోస్పాడు మండలంలో తమకు ఆధిక్యత వస్తుందని నంద్యాల పట్టణం, గ్రామీణ మండలాల్లో సమానం చేయగలమని దీంతో కొద్ది ఆధిక్యతతోనైనా విజయం సాధిస్తామని వైసీపీ అభిప్రాయపడుతోంది. అయితే ఖచ్చితంగా విజయం తమదేనని ఇరువర్గాలు స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం.
వైసీపీ ధీమా అదే..
గోస్పాడులో రికార్డు స్థాయి పోలింగ్ పెరగడంతో ఆ ఓటింగ్ శాతం తమకే కలిసొస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే తమ పార్టీ గెలుపులోకి కీలకమని భావిస్తోంది. కాగా, గోస్పాడు మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ మండలంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటింగ్ ఇలా..
ఆ మండలంలో మొత్తం 28,600 ఓటర్లు ఉన్నారు. గ్రామాల వారీగా పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి. కానాలపల్లెలో 1449కి గాను 1349 పోలయ్యాయి. నెహ్రునగర్లో 864 ఓట్లకు 808, యాళ్ళూరులో 6600 ఓట్లకు 5940, పసురుపాడులో 1641 ఓట్లకు 1501, దీబగుంట్లలో 3220 ఓట్లకు 2725, ఎం.చింతకుంట్లలో 1083 ఓట్లకు 972, జూలేపల్లెలో 1890 ఓట్లకు 1702, తేళ్ళపూరిలో 587 ఓట్లకు గాను 543, రాయపాడులో 481 ఓట్లకు 443, కూలూరులో 417 ఓట్లకు 381, సాంబవరంలో 1920 ఓట్లకు 1740, గోస్పాడులో 2934 ఓట్లకు 2670, ఎం.కృష్ణాపురంలో 1300 ఓట్లకు 1242, ఒంటివెలగలలో 737 ఓట్లకు 684, జిల్లెల్లలో 3450 ఓట్లకు 3086, ఎస్.నాగులవరంలో 772 ఓట్లకు 658 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. గోస్పాడు మండలంలో రికార్డు స్థాయిలో ఉప ఎన్నికలో 90.20 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో ఎక్కడా ఏలాంటి సంఘటనలు జరగలేదు.
టీడీపీ వైపేనా..
తాజా పోలింగ్ సరళిని గమనించినప్పుడు పట్టణ పరిధిలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కుల నాయకుల మనోగతం, మహిళలు, యువకుల అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 3నుంచి 6వేల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నంద్యాల పట్టణంలో ముస్లిం, వైశ్య వర్గాలకు చెందిన ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద ఎక్కువ సంఖ్యలో కనిపించడంతో మెజార్టీ మరింత పెరుగుతుందన్న నమ్మకం ఆ పార్టీలో పెరిగింది.
వైసీపీ ప్రభావం చూపింది..
అదే సమయంలో అటు వైసిపి కూడా గెలుపు గుర్రాన్ని వదిలిపెట్ట లేదు. నంద్యాల గ్రామీణ ప్రాంతాలు, గోసుపాడు మండలాల్లో వైసీపీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పట్టణంలో బలిజలు కూడా సగం వరకూ తమకే మద్దతునివ్వడంతోపాటు, మహిళలు, యువకులు తమ వైపే మొగ్గు చూపినందున తమకు 17వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.
టీడీపీకీ మెరుగైన అవకాశాలే..
గత ఎన్నికలో అప్పటి వైసీపీ అభ్యర్థి కేవలం 3600 ఓట్లతోనే విజయం సాధించారు. ఇప్పుడు పట్టణ ప్రాంతంలో టిడిపికి కొంచెం మెరుగైన వాతావరణం కనిపించింది. గతానికంటే మెజారిటీ స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికపై ఇప్పటికి రెండు నివేదికలిచ్చిన ఓ సర్వే సంస్థ కూడా టిడిపికి పట్టణంలో వచ్చే ఓట్లతో 3వేల వరకూ మెజారిటీ తెచ్చుకుంటుందని, అదే సమయంలో రూరల్-గోసుపాడు మండలాల్లో టిడిపి కంటే వైసీపీకే ఎక్కువ మొగ్గు ఉందని తాజాగా పేర్కొంది. ఈ ఎన్నికలో డబ్బు కీలక ప్రభావం చూపింది.
విచిత్రమైన పరిస్థితి..
పోలింగ్ రోజు సాయంత్రం వరకూ పార్టీల నేతలు ఓటరుకు డబ్బులిచ్చి పోలింగ్బూత్లకు తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు కూడా తమకు ఇంత ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేసి, డబ్బు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ బూత్లకు వెళ్లడం గమనార్హం.
మహిళలు టీడీపీకి అండగా నిలుస్తారా?
నంద్యాల పట్టణంలో మహిళలు ఎక్కువగా పోలింగుకు రావడం టిడిపికి అనుకూలిస్తుంది. రెండు మండలాల్లో పురుషులే ఎక్కువగా హాజరయ్యారు. ఇక్కడ యువకులు, మహిళలు వైసీపీకే జై కొట్టినట్లు కనిపించింది. గోసుపాడులో వైసీపీకి గణనీయమైన మొగ్గు కనిపించాలి. కానీ ఇక్కడ మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరిన ప్రభావం టిడిపికి అనుకూలించినా మెజారిటీ వైసీపీ వైపే ఉంది.
పోటాపోటీగానే.. ఆరోజే ఉత్కంఠకు తెర
పట్టణంలో పోలింగ్ చివరి మూడు గంటల ముందు, టిడిపి పోల్ మేనేజ్మెంట్ ప్రదర్శించింది. ఆ పార్టీకి చెందిన ముస్లిం నేతలు తమ వర్గానికి చెందిన వారిని పోలింగ్ బూత్లకు వాహనాల్లో తీసుకురాగా, వైశ్య వర్గానికి చెందిన నేతలు, కౌన్సిలర్లు కూడా అదే పద్ధతి పాటించారు. దానితో పోలింగ్ శాతం ఆఖరులో అనూహ్యంగా పెరిగింది. పట్టణంలోని క్రైస్తవ, మాల వర్గం.. రెండు మండలాల్లోని మాల వర్గం వైసీపీకే మద్దతు పలికినట్లు కనిపించింది. పోలింగుకు ముందు బలిజలపై టిడిపి పట్టు ప్రదర్శించగా, పోలింగ్లో ఆ వర్గం అటు వైసీపీకీ సరిసమానంగా మొగ్గు చూపినట్లు కనిపించింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీ ప్రచారం నిర్వహించి గెలుపుకోసం తమవంతుగా పూర్తిస్థాయిలో కృషి చేశారు. అయితే, ఓటర్ల చెప్పిన తీర్పు ఎలా ఉందో తెలియాలంటే మాత్రం ఆగస్టు 28వరకు ఆగాల్సిందే.