ఇద్దరు చంద్రులు సెల్ఫీలు దిగారు,విందు ఆరగించారు, నవ్వులు పూయించారు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఇచ్చిన విందులో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ సుమారు అరగంటపాటు మాట్లాడుకొన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు అంశం తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో కసరత్తు ఎక్కువ చేస్తే తాను చేసిన నిర్ణయం లీక్ అవుతోందనే ఉద్దేశ్యంతోనే ఆకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్రర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్ లు పాల్గొన్నారు. అయితే విందు ముగిసిన తర్వాత సుమారు అరగంటపాటు కెసిఆర్ , చంద్రబాబులు మాట్లాడుకొన్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరానికి దారితీసిన పరిస్థితులను ప్రధానమంత్రి మోడీ తనకు వివరించారని తెలంగాణ సిఎం కెసిఆర్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. సాధారణ వ్యక్తిగా ఉన్న తనను ప్రధానమంత్రిని చేసిన ప్రజల రుణాన్ని తీర్చుకొనేందుకే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
పెద్ద నగదు నోట్ల రద్దుతో తాత్కాలికంగా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని అభిప్రాయపడుతున్నారని కెసిఆర్ వివరించారు. రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న సమస్యలపై చర్చించారని సమాచారం.
ముఖ్యమంత్రుల మాటా మంతీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, అధికారులు, రాజకీయపార్టీల నాయకులు హజరయ్యారు.అయితే విందు ముగిసిన తర్వాత తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబునాయుడులు సుమారు అరగంటపాటు నిలబడే మాట్లాడుకొన్నారు. పెద్ద నగదునోట్ల రద్దును ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇటీవల తాను కలిసిన సందర్భంలో ప్రధానమంత్రి వివరించారని కెసిఆర్ చెప్పారు. పెద్ద నగదు నోట్ల రద్దు మంచిదే అయినా , కొంత సమయం కసరత్తు చేయాల్సి ఉండేదని తాను ప్రధానికి సూచిస్తే, కసరత్తు చేస్తే తాను తీసుకొన్న నిర్ణయం లీకై అక్రమార్కులు జాగ్రత్తలు తీసుకొనేవారని ప్రధాని చెప్పారన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులున్నా, దీర్ఘకాలంలో ప్రజలకు ప్రయోజనమే జరుగుతోందని ప్రధాని చెప్పారన్నారు. పులి మీద స్వారీ చేస్తున్నారని ప్రధానితో తాను చెప్పగానే, అన్నింటికీ సిద్దపడే ఈ నిర్ణయాన్ని తీసుకొన్నానని ప్రధాని వివరించినట్టు చెప్పారు. నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకు అనివార్య పరిస్థితుల్లో చేయక తప్పదన్నారాయన.చాలా విషయాలు మాట్లాడుకొన్నారన్నమాట అని చంద్రబాబు అనగానే, తాను ప్రధానిని మీ మాదిరిగా ఎక్కువసార్లు కలవనని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రులతో సెల్ఫీలు
వర్నర్ ఇచ్చిన విందుకు హజరైన ముఖ్యమంత్రులతో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణులు సెల్ఫీలు తీసుకొన్నారు. విందు ముగిసిన తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్న తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వద్దకు ఇద్దరు క్రీడాకారిణులు సానియా మీర్జా, పి వి సింధు వచ్చారు. మీ ఇద్దరూ అరుదుగా కలుస్తారు. మీ తో సెల్పీ తీసుకొంటామని వారు చెప్పారు. దీనికి ఇద్దరూ సిఎంలు కూడ అంగీకరించారు. అయితే ఫోటో దిగే సమయంలో నవ్వండి అంటూ వారు ముఖ్యమంత్రులను కోరగానే వారు నవ్వుతూ ఫోటోకుఫోజులు ఇచ్చారు.
ప్రముఖులు శ్రోతలుగా సిఎంల ముచ్చట
అరగంటపాటు జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల పిచ్చాపాటీ సంబాషణల్లో రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయప్రముఖులు, కేంద్రమంత్రులు, శ్రోతలుగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సంభాషణల సమయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సుజానా చౌదరిలు తొలి నుండి చివరి వరకు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నాయకుడు జానారెడ్డి, ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ దాక్టర్ కోడెల శివప్రసాదరావులు శ్రోతలుగా ఉన్నారు. ఎవరో ఒకరు తమ చుట్టూ ఉండడం చేత రాజకీయ అంశాలు మినహ ఇతర అంశాలపైనే ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకొన్నారు. వారి మద్య రెండు రాష్ట్రాలకు చెందిన అంశాలను ప్రస్తావించుకొన్నారు.
సమస్యలపై చర్చించారు
రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న ఆస్తులు, అప్పుల విభజన సమస్యలపై ఇద్దరూ ముఖ్యమంత్రులు చర్చించారు. ఇరు రాష్ట్రాలు నియమించిన కమిటీలు త్వరగా పనులను పూర్తిచేసి విభజనను పూర్తిచేయాల్సిన అవసరం ఉందని ఇద్దరూ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ఎపి సచివాలయం భవనాలను తమకు అప్పగించాలన్న కోరిన విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తుచేశారు. అయితే అన్ని అంశాలను ఒకేసారి పరిష్కరించుకొందామని ఎపి సిఎం చంద్రబాబు కెసిఆర్ కు సూచించారు. ఈ భవనాల అంశాన్ని తమ మంత్రుల కమిటీ చూస్తోందని ఆయన వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని చూడాలని కేంద్రమంత్రి సుజనా చౌదరిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు.
క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ కోసం ఏం చేస్తున్నారు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. డిజిటల్ కరెన్సీని అలవాటు చేస్తున్నట్టు ఎపి ముఖ్యమంత్రి చెప్పారు. ఒకసారి నగదు రహిత విధానానికి ప్రజలు అలవాటు చేస్తే వారు ఆ పద్దతులకు అలవాటు పడతారని ఆయన చెప్పారు. నగదు రహిత గ్రామాలను పెంచుకొంటుపోతున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణలో ఏం చేస్తున్నారని కెసిఆర్ ను ఆరా తీశారు చంద్రబాబు.నగదు రహిత గ్రామాలను ప్రోత్సహిస్తూనే నగదు లేకుండా డిజిటల్ విధానం వైపు ప్రజలను తీసుకెళ్తున్నామని కెసిఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాలకు కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
అన్ని రకాల వంటలతో విందు
గోంగూర పచ్చడి, గ్రీన్ సలాడ్, చెర్రీటమోటో, గ్రిల్డ్ వెజిటేబుల్ సలాడ్, వంకాయ,టమాటో పచ్చడి,పాపడ్, రాయితా, మోగ్ హర్త్ ,సబ్ బదామి, షోర్బా, ఆచారీ పనీర్, భట్టీ కా ఆలూ, వెజిటేబుల్ శికంపూర్ కబాబ్ , పనీర్ ఖత్తా ప్యాజ్,నిజామీ హండీ, లసూనీ చిరోంజి పాలక్ , ఆలూ, కట్టియానీ ,హైద్రాబాద్ ఖట్టి దాల్, హైద్రాబాద్ సబ్జ్ బిర్యానీ మిర్చీ కా సాలన్ తదిత వెరైటీలను అతిథులకు వడ్డించారు. ఈ విందుకు వచ్చిన అతిథులకు గవర్నర్ దంపతులు దగ్గరుండి వంటలను వడ్డించారు.