విస్తరణపై కెసిఆర్ కసరత్తు: ఆ ఇద్దరికి గండమే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి పునర్వ్యస్థీకరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంసెట్ లీకేజీతో తీవ్ర అసంతృప్తికి గురైన కెసిఆర్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు పూనుకుంటున్నారనే వార్తలతో మంత్రులు వణుకు ప్రారంభమైంది.
ఎంసెట్ లీకేజీతో ప్రభుత్వంపై మచ్చ పడిందని, విద్యార్థుల నుంచి, వారి తల్లదండ్రుల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు వ్యక్తమైందనే అభిప్రాయం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాల్లో ఉంది.

200 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం లీకైతే కనిపెట్టలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఎంసెట్ లీకేజీ వల్ల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చిక్కుల్లో పడవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటనతో మిగతా మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు.
హరితహారం అమలుపై ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా కొంత మంది మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. మంత్రుల్లో కొంత మందికి ఉద్వాసన తప్పకపోవచ్చునని కూడా అంటున్నారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకునే విషయంలో కెసిఆర్ వెనకాడవచ్చునని అంటున్నారు. సీనియారిటీ, కుల సమీకరణల రీత్యా ఆయన శ్రీహరి పట్ల కెసిఆర్ ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications