కల్వకుర్తి నుంచి జైపాల్ పోటీ: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి.. నాగానికి ‘చే’యూత?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ముఖాముఖీ పోరాటానికి రంగం సిద్ధం అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి జైపాల్ రెడ్డి సీఎం అభ్యర్థి అన్న ప్రచారం ముందుకు వచ్చింది.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు 18నెలల సమయం ఉంది. కానీ తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎం అభ్యర్థులం అని ప్రచారం చేసుకునే నేతల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే ఆయన పేరు వినిపిస్తున్నా.. తాజాగా అదే పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. ఆయనే ఎస్ జైపాల్ రెడ్డి. 1980వ దశకం వరకు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. తర్వాత జనతాదళ్ పార్టీ తరఫున.. టీడీపీ మద్దతుతో పార్లమెంట్కు ఎన్నికైన జైపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడే. 1977లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో తర్వాత జనతాదళ్ పార్టీలో కీలక పాత్ర పోషించారు.
కానీ 1996 - 98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 1998లో అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. అక్కడ నుంచి మళ్లీ మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు.మళ్లీ తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సొంత అసెంబ్లీ నియోజకవర్గం కల్వకుర్తి స్థానం నుంచి పోటీ చేయాలని సంకల్పిస్తున్నారని వార్తలొచ్చాయి. దీంతో సీఎం అభ్యర్థి జైపాల్ రెడ్డి అన్న ప్రచారం కూడా సాగుతోంది.
టీడీపీ కనుమరుగు.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ కనుమరుగు అవుతుండగా, అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖీ పోరాటానికి రంగం సిద్ధం అవుతున్నది. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పని చేసిన ఎనుముల రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్కు దీటుగా ‘మాటల తూటాల' సరితూగే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య అసెంబ్లీ టిక్కెట్ల కోసం గొడవ మొదలైంది. ఈసారి టికెట్ తమకే దక్కుతుందని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ సమరోత్సాహానికి సిద్ధమవుతున్నారు. పార్టీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి బరిలో ఉంటారని.. ఆయన సొంత నియోజకవర్గం కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కందనూలులో ప్రత్యర్థులు నాగం జనార్దన రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఒక్కటయ్యారని, త్వరలో నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని జోరుగా ఉహాగానాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రాకతో ఉత్సాహం
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఔత్సాహిక నేతలు ఈసారి టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు అనూహ్యంగా తెరపైకి వచ్చిన నాయకులు గతంలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పరాజయం పొందిన నేతలతో పాటు గెలిచిన వారికి సైతం చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు రేవంత్రెడ్డి రాకతో రాష్ట్ర కాంగ్రెస్లో ఉత్సాహం చోటు చేసుకోగా, సొంత జిల్లా కందనూలులోనూ ఆయన ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
గ్రూపు రాజకీయాలతో కొంప మునిగిందని హర్షవర్దన్ రెడ్డి
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ హరిత ట్రిబ్యూనల్లో కేసులు వేసి, పాలకులను ఇరుకున పెట్టిన నియోజకవర్గ ఇన్చార్జ్ హర్షవర్ధన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలే తనకొంప ముంచాయని హర్షవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడూ అలాంటి తలనొప్పులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జగదీశ్వర్రెడ్డి నాగం జనార్దన్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. పలుమార్లు జూపల్లి కృష్ణారావుపై జగదీశ్వర్రెడ్డి టీడీపీ తరుఫున పోటీ చేసి త్రుటిలో ఎమ్మెల్యే చాన్స్ మిస్సయ్యారు.
హర్షవర్దన్ రెడ్డికే టిక్కెట్ వస్తుందని డీకే అరుణ హామీ
ఈసారి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న ప్రచారం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఇటీవల బహిరంగంగా ప్రకటించి వార్తల్లోకెక్కారు. త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణను ఆయన ఇటీవల కలిశారు. ఈ సంగతి తెలుసుకుని హర్షవర్ధన్రెడ్డి వర్గీయులు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణను ప్రశ్నించడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. హర్షవర్ధన్రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని జగదీశ్వర్రెడ్డికి మాటివ్వలేదని, ఆయన పార్టీలో చేరితే ఎలాంటి అభ్యంతరం లేదని డీకే అరుణ చెప్పినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎత్తులు, జిత్తులతో ఫలితాలు తలకిందులు అవుతూ వస్తున్నాయి. ముందు ఒకరు గెలుస్తారని అంతా భావిస్తున్న తరుణంలో ఇక్కడ ప్రతిసారీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సుదీర్ఘ అనుభవంతో ఏదోలా గట్టెక్కుతున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీలో ఉండడంతో తాడోపేడో తేల్చుకుంటామని హర్షవర్ధన్రెడ్డి సవాల్ విసురుతున్నారు.
ఒంటెద్దు పోకడలతో అందరికీ దూరమైన వంశీచంద్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వంశీచంద్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు పలు అంశాలపై ఆయన రాష్ట్రస్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. కానీ నియోజకవర్గస్థాయిలో మాత్రం ఆయనపై పార్టీ కార్యకర్తల్లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఒంటెద్దు పోకడలతో వంశీచంద్రెడ్డి అందరినీ దూరం చేసుకుంటున్నారని సొంత కాంగ్రెస్ పార్టీ వారే విమర్శిస్తున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు, మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే తీరు నచ్చకే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారని చెబుతున్నారు.
టిక్కెట్పై వంశీచంద్ రెడ్డి ధీమా ఇది
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా జైపాల్రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీలో ఉంటారని, కాంగ్రెస్కు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తారని ఆయన అభిమానులు సంబురాలు చేస్తున్నారు. జైపాల్రెడ్డి కూడా ఇందుకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలోనూ వీరంతా వ్యతిరేకించినా తాను కల్వకుర్తి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ హవా ఉన్న సమయంలోనే గెలిచానని ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు వర్గాలుగా చీలిందని చెబుతున్నారు. పార్టీని సమన్వయం చేయకపోతే నష్టం తప్పదని పలువురు పార్టీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు.
వంశీకృష్ణకు పోటీగా చారకొండ ?
ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అచ్చంపేట కాంగ్రెస్లో రెండు సామాజిక వర్గాల నాయకుల మధ్య ఈసారి టికెట్ విషయంలో పోటీ నెలకొంది. మొన్నటి దాకా టికెట్ తనకే వస్తుందని భావించిన డాక్టర్ వంశీకృష్ణకు పోటీగా ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రధాన అనుచరుడు చారకొండ వెంకటేష్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేట. ఈ నియోజకవర్గంలోని వెల్దండ మండలం కొండారెడ్డిపల్లి ఆయన స్వగ్రామం కావడంతో సొంత నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరుడికే టికెట్ ఇప్పించి తీరుతాడని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పీ రాములుకి గట్టిపోటీ ఇవ్వాలంటే వారి సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ను రంగంలోకి దింపాలన్న వాదన వినిపిస్తుండడంతో వంశీకృష్ణ ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. తనకు నియోజకవర్గంలోని ప్రతి గడపతో సత్సంబంధాలు ఉన్నాయని, ఈసారి తన గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీగా దామోదర్ ఎన్నికకు నాగం సహకారం?
ప్రస్తుతం నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి 1999, 2004, 2009, 2012 (ఉప ఎన్నికల్లో) ప్రత్యర్థులుగా ఢీకొన్నా నాగం గెలుపొందారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ ఒక్కటయ్యారన్న ప్రచారం జరుగుతోంది. పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగానే దామోదర్రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికవ్వడానికి నాగం జనార్దన్రెడ్డి తనవంతుగా కృషి చేశారని, నాగర్కర్నూల్ నగర పంచాయతీలోనూ వీరిద్దరి సఖ్యత వల్లే కాంగ్రెస్, బీజేపీ కలిశాయని ప్రచారం జరుగుతోంది. తామిద్దరం పోటీ పడడం వల్ల మరొకరు లాభపడే అవకాశం ఉందని, అలా జరగకుండా ఈసారి ఎవరో ఒకరే అసెంబ్లీ బరిలో ఉండాలని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇరు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో నాగం జనార్దన్రెడ్డి పార్టీ మారుతారా అన్న ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.