విభజన: కిరణ్ రెడ్డి వ్యాఖ్యలపై కంగు, దుమారం
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించిన నివేదికలోని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులపై, రాష్ట్రంలోని బలహీనవర్గాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికారం కోరుకుంటున్న కొన్ని కులాల కారణంగానే రాష్ట్ర విభజన ముందుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దళితులకు, బిసిలకు వ్యతిరేకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని రాజకీయ నాయకులు కొందరు తప్పు పడుతున్నారు. టీవీ చానెళ్లలో జరిగిన చర్చల్లో ఈ విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా, ఆయన సమర్పించిన రహస్య నివేదికలోని కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు దుష్టశక్తులుగా అవతారమెత్తి దేశంలోనే నాలుగో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆయన లిఖితవూర్వకంగానే చేశారు. ఈ నివేదికను చూసిన జీవోఎం సభ్యులు కంగు తిన్నారట. ఆ వ్యాఖ్యలు తమను ఉద్దేశించే చేశారని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
విభజనకు ఆ దుష్టశక్తులు కుట్ర పన్నడానికి కారణాలు లేకపోలేదని కూడా కిరణ్ కుమార్ రెడ్డి అందులో చెప్పారట. దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రంగానూ, అభివృద్ధిలోనూ ఇతర రాష్ట్రాలకు ఓ ట్రెండ్ సెట్టర్గా ఉంటూ శరవేగంగా దూసుకెళుతోందని, ఇది ఇతర రాష్ట్రాలకు కంటగింపుగా మారిందని, దీంతో అతి పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఆ దుష్టశక్తులు కుట్ర చేశాయని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
రాజకీయ అధికారం, పెత్తనం కోసం శతవిధాలుగా తహతహలాడుతున్న రాష్ట్రంలోని కొన్ని కులాలు, ఫ్యాక్షన్ గ్రూపులు పెట్టిన చిచ్చు, ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీన సమయంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయలేక పోవడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులను మూడు ప్రాంతాల మధ్య సమంగా పంచడంలోనూ, ఆరోగ్యకరమైన సంప్రదాయాలను నెలకొల్పడంలో వైఫల్యం చెందడం కూడా విభజనకు కారణాలుగా ఆయన తన నివేదికలో వివరించినట్లు సమాచారం.