నంద్యాల: పోటాపోటీ వ్యూహలు, భూమా హమీల అమలు, ఒత్తిళ్ళు, ప్రలోభాలు
నంద్యాల స్థానంలో విజయం సాధించేందుకు రెండుపార్టీలు కూడ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. భూమానాగిరెడ్డి హమీలను నెరవేర్చేందుకు టిడిపి వేగంగా పనులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి పనులు పుర
నంద్యాల: నంద్యాల స్థానంలో విజయం సాధించేందుకు రెండుపార్టీలు కూడ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. భూమానాగిరెడ్డి హమీలను నెరవేర్చేందుకు టిడిపి వేగంగా పనులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి పనులు పురోగతిలో ఉండేలా చర్యలు తీసుకొంటోంది.మరోవైపు ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి అడ్డదారులుతొక్కోందని వైసీపీ ఆరోపిస్తోంది. తమపార్టీకి చెందిన నేతలను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైసీపి అభ్యర్థి శిల్పామోహన్రెడ్డి ఆరోపిస్తున్నారు.
తమపార్టీకి చెందిన నేతలను పలురకాలుగా ఇబ్బందులుపెడుతున్నారని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతలను అధికారపార్టీలో చేర్చుకొనేందుకుగాను టిడిపి నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఈ ఎన్నికలను 2019 ఎన్నికలకు సెమీఫైనల్గా రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకొన్నాయి.
ఒత్తిళ్ళు, ప్రలోభాలు
నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అధికారపార్టీ ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దాడులను నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధికారపార్టీ అన్నిరకాల అస్త్రాలను ఉపయోగిస్తోందని వైసీపీ నేత శిల్పామోహన్రెడ్డి ఆరోపిస్తున్నారు.
పార్టీమారాలంటూ నాగిరెడ్డికి ఆశలు
మార్క్ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న నాగిరెడ్డిని పార్టీ మారాలంటూ అధికారపార్టీనుండి ఒత్తిడులు వస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. కొందరు అధికారపార్టీకి చెందిన కీలకనేతలు, మంత్రులు కూడ ఈ విషయమై ఆయనను పార్టీ మారాలని కోరుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను మాత్రం టిడిపి నేతలు తప్పుబడుతున్నారు. తాము ఎవరిని బెదిరించడం లేదని చెబుతున్నారు. పార్టీ చేస్తున్న అభివృద్దికార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా మారి తమ పార్టీలో చేరుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.
Recommended Video
ఎత్తులకు పై ఎత్తులు
నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అధికారపార్టీ అన్నిరకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. పార్టీలో ఇటీవల చేరిన మాజీ మున్సిఫల్ ఛైర్మెన్ నౌమాన్కు ఉర్ధూ అకాడమీ చైర్మెన్ పదవిని ఇచ్చింది. మాజీ మంత్రి ఫరూఖ్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టనుంది. మైనార్టీ, బలిజ, ఆర్యవైశ్య ఓటర్లు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉంటారు.ఈ మేరకు కాపు కళ్యాణమండపానికి రూ.3 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మాజీమంత్రి టిజి వెంకటేశ్, కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యూహరచన చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కూడ టిడిపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. అధికారపార్టీ వేసే ఎత్తుగడలను తిప్పికొట్టేవిధంగా చర్యలను తీసుకొంటోంది.
భూమా హమీల అమలుకు చర్యలు
2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ఇచ్చిన హమీలను నేరవేర్చేందుకు టిడిపి ప్రయత్నాలను చేస్తోంది. గత ఎన్నికల సమయంలో తాను విజయం సాధిస్తే గృహనిర్మాణపథకాలు, రోడ్ల విస్తరణతోపాటు ఇతర సంక్షేమ పథకాలను చేపట్టనున్నట్టు భూమా నాగిరెడ్డి ప్రకటించారు.అయితే ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి ఈ పనులు పురోగతిలో ఉంటే ప్రయోజనమని అధికారపార్టీ భావిస్తోంది.ఈ మేరకు మంత్రి భూమా అఖిలప్రియ ఈ మేరకు ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులను తెచ్చింది. గత నెలలో చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా నంద్యాలలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఏ పనులు చేపడితే తమకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించి టిడిపి నేతలు వాటిని అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.