'ప్రత్యేక'మా: బాబుకు కేంద్రమంత్రి షాక్, ఏపీ మాటలే అప్పజెప్పారు!
విజయవాడ: కేంద్రమంత్రి, బిజెపి నేత బీరేంద్ర సింగ్ ఓ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇచ్చారా? కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదంటున్న టిడిపికి, చంద్రబాబుకు ఏపీ బీజేపీ నేతల్లా సూటిగా కాకుండా పరోక్షంగా ఝలక్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీల పైన రాష్ట్ర బిజెపి, టిడిపి నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కనిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదని, విభజన హామీలు నెరవేర్చడం లేదని టిడిపి నేతలు మండిపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినవి కూడా ఉన్నాయి.
అదే సమయంలో ఏపీ బిజెపి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తుంటారు. కేంద్రం చాలా సాయం చేసిందని, వాటి లెక్కలు ఏపీ ప్రభుత్వం చెప్పడం లేదని, కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని విడతలవారీగా నెరవేరుస్తుందని చెబుతుంటారు. ఏపీ టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ కనిపిస్తుంటోంది.
చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన వెంకయ్య నాయుడు కూడా ఇటీవల పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా, కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. ఆయన నిధులు రాబట్టడటంలో దిట్ట అని, అభివృద్ధి చేస్తారని ఆకాశానికెత్తారు.
మంగళవారం విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో బీరేంద్ర సింగ్, చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ గురించి అభ్యర్థించారు.
దానికి కేంద్రమంత్రి బీరేంద్ర మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘాన్ని రిఫర్ చేస్తూ అదేమీ రాష్ట్రం కోసం అదనపు నిధులు విడుదల చేయమని ప్రత్యేక సిఫార్సులు చేయలేదని చెప్పారు. అంతేకాదు, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు వాటిని ఏదోవిధంగా సమకూర్చుకోగల సమర్థుడు అని చెప్పారు.
తద్వారా కేంద్రంపై ఆధారపడటం మానుకోవాలని కేంద్రమంత్రి పరోక్షంగా చంద్రబాబుకు చెప్పారని అర్థమవుతోందని అంటున్నారు. అంతేకాదు, ఏపీ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్రం రెండంకెల ఆర్థిక పురోగతి సాధించిందని, అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని ఆర్థిక మంత్రి యనమల, సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో, ఇప్పుడు కేంద్రమంత్రి చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మాటలే అప్పజెప్పారని ఎద్దేవా చేస్తున్నారు.
అదే సమావేశంలో చంద్రబాబు.. కేంద్రం సాయం పైన ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీరేంద్ర సింగ్తో చెప్పారు. దానికి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ... ఏపీని ప్రత్యేకంగా చూడలేమని, అన్ని రాష్ట్రాలతో సమానంగా చూస్తామని చెప్పారు. ఓ రకంగా ఆయన వ్యాఖ్యలు చంద్రబాబుకు షాక్ అని అంటున్నారు.