అద్వానీ శిష్యుడు: విశ్వసనీయతకు మారుపేరు వెంకయ్య
చిత్తశుద్ధితో నమ్మిన సిద్ధాంతాల ఆచరణ.. నడిచే దారిలో ఎంత కష్టం వచ్చినా మడమతిప్పక ముందుకే సాగటం వంటి ఉన్నత లక్షణాలు వెంకయ్యనాయుడిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా దోహదపడ్డాయి.
న్యూఢిల్లీ: చిత్తశుద్ధితో నమ్మిన సిద్ధాంతాల ఆచరణ.. నడిచే దారిలో ఎంత కష్టం వచ్చినా మడమతిప్పక ముందుకే సాగటం వంటి ఉన్నత లక్షణాలు వెంకయ్యనాయుడిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా దోహదపడ్డాయి. తెలుగువారు దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ నిర్వర్తించారు.
నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా.. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, వీఎస్ రమాదేవి ప్రధాన ఎన్నికల కమిషనర్గా సేవలందించారు. అత్యున్నత పదవిని అలంకరిస్తున్న తెలుగువారి జాబితాలో ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా చేరుతున్నారు.
నిరంతర శ్రమ, అభ్యాసతత్వం, 100 శాతం ఫలితాల సాధనకు యత్నించడం వంటి అంశాలే ఆయన్ను వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లాయి. తెల్లని పంచె, చొక్కాతో సాధారణ వ్యక్తిగా కనిపించే వెంకయ్యనాయుడుది అత్యంత సునిశిత పరిశీలనా దృష్టి. ఒక వ్యక్తి తన ముందుకొస్తేనే ఆమూలాగ్రం అతనిలోని శక్తిసామర్థ్యాలను అంచనావేసే అరుదైనతత్వం ఆయన సొంతం. నిరంతరం విద్యార్థిలా గతిశీలంగా ఉండటం, భేషజాలకు పోకుండా వాస్తవాలను జీర్ణించుకొని మార్పును వెంటనే అంగీకరించడం ఆయనకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టింది.

దక్షిణాదిలో బలం లేకున్నా ఇలా పయనం
వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితంలో గెలుపు ఓటములకు ఎన్నడూ వెరవలేదు. దక్షిణ భారత దేశంలో బీజేపీ పునాదులు అంత బలంగా లేకపోయినా ఆయన ఆ పార్టీకే అంకితయ్యారు. 1977లో ఒంగోలులో జనతాపార్టీ నుంచి లోక్సభకు పోటీచేసి ఓడిపోయినా, 1978లో అదే జనతాపార్టీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఒంటరిగా పనిచేసి గెలిచారు. అయిదేళ్లపాటు అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేతగా వెంకయ్యనాయుడి వాగ్దాటి తెలుగు ప్రజలు ఎన్నటికీ గుర్తుండేలా చేసింది. 1985లో తెలుగుదేశం పొత్తుతో ఉదయగిరి నుంచి కాక ఆత్మకూరులో పోటీచేసి కొద్ది ఓట్లతో ఓటమి పాలయ్యారు. అది రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలవైపు తీసుకెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణం కోసం ఆయన పడిన తపన, చిత్తశుద్ధి, నిజాయితీ అగ్రనేతలైన వాజ్పేయి, అద్వానీలను ఆకట్టుకున్నాయి.
Recommended Video


కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు రాజ్యసభకు ప్రాతినిధ్యం
1993లో అద్వానీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత వెంకయ్యను జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. నాటి నుంచి జాతీయపార్టీలో ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వచ్చారు. 1989లో బాపట్ల, 1996లో హైదరాబాద్ లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రోడ్ల అనుసంధానానికి యత్నం
వాజ్పేయ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధిమంత్రిగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి గ్రామాలను రహదారి అనుసంధానించారు. మారుమూల గ్రామాలకూ మట్టిరోడ్లు, తారురోడ్లు తెచ్చారు. ఇప్పుడు పట్టణాభివృద్ధిమంత్రిగా స్మార్ట్సిటీలు, అమృత్ పథకాలు తెచ్చి తనదైన ముద్రవేశారు.

మాతృభాషకే తొలి ప్రాధాన్యం
వెంకయ్యనాయుడు జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగినా తెలుగు వాడిగా ఉన్న గుర్తింపును పోగొట్టుకోలేదు. సాధారణంగా జాతీయస్థాయి నాయకులు తనపై ప్రాంతీయ ముద్రపడకుండా జాగ్రత్తలు పడతారు. మాతృభాషలో మాట్లాడితే ఎక్కడ తన స్థాయి కుంచించుకుపోతుందోనన్న భయంతో ఆంగ్లం, హిందీల్లో మాట్లాడటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, వెంకయ్య తెలుగు మీద ప్రేమను మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ చూపారు. ఎంతస్థాయికి ఎదిగినా ధైర్యంగా తెలుగులోనే మాట్లాడారు. ఆయన ఎప్పుడూ వ్యక్తులను, వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయలేదు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సిద్ధాంతపరమైన విమర్శలే చేశారు. అందుకే ఎవ్వరితోనూ వ్యక్తిగత బంధాలు దెబ్బతినలేదు. అందరూ అజాతశత్రువుగా భావించే పరిస్థితి ఉంది.

1984 సంక్షోభంలోనూ కీలక పాత్ర
వెంకయ్యను అద్వానీకి ప్రియశిష్యుడంటారు. అగ్రనేతలకు అంతగా దగ్గర కావడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడులోని సంస్థాగత నైపుణ్యం, వాక్పటిమ, తలలో నాలుకలా ఉంటూ పార్టీ సమస్యను తన సమస్యగా భావించడమేనన్న అభిప్రాయం ఉన్నది. ఎన్టీఆర్ను అప్పటి గవర్నర్ రామ్లాల్ దించేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. తాను మంచిదని భావిస్తే ఎంతవరకైనా వెళ్తారు. ఇలాంటి లక్షణాలే అద్వానీ, వాజ్పేయిలకు నమ్మినబంటుగా మార్చాయి. అద్వానీ ప్రియశిష్యుడిగా ఉన్న ఆయన... మోదీ వచ్చిన తర్వాత గురువును వదిలిపెట్టారని బయట ప్రచారంలో ఉంది. వికాస్ పురుష్ అంటూ వాజ్పేయిని, ఉక్కుమనిషంటూ అద్వానీని ఎలా ప్రశంసించేవారో ఇప్పుడు మోదీ దైవదూత అని సంబోధించటంలో వెంకయ్యనాయుడు ఉద్దేశం ఆయా నేతల శక్తి సామర్థ్యాలను గుర్తించటమేనని అంటారు. విభిజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదోఒకటి చేయాలన్న తపనతో వ్యవహరించడమే అందుకు నిదర్శనం. కేంద్రమంత్రిగా ఉంటూ ఒక రాష్ట్రానికి పనిచేస్తారనే అపవాదు వస్తుందనిపించినా ఆయన అన్యాయం జరిగిన రాష్ట్రానికి ఎంతోకొంత న్యాయం చేయాలన్న మొండిపట్టుదలతో పనిచేశారు.












Click it and Unblock the Notifications