చైనాలో విజయ్ మాల్యాలకు అవకాశం లేదు: చుక్కలు చూపిస్తారు!
బ్యాంకుల నుంచి రూ. 9వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేసి ఎంచక్కా ఇంగ్లాండ్కు పారిపోయారు పారిశ్రామికవేత్త, లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా.
బీజింగ్: మనదేశంలో చట్టాలు కఠినంగా లేకపోవడం కారణంగానే నేరస్తులు, దోపిడీ చేసిన వాళ్లు నిర్భయంగా తప్పించుకు తిరుగుతున్నారనే వాదన ఎప్పట్నుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో కొంతమేర వాస్తవం లేదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే చోటు చేసుకుంటున్నాయి.
ఉదాహరణకు బ్యాంకుల నుంచి రూ. 9వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేసి ఎంచక్కా ఇంగ్లాండ్కు పారిపోయారు పారిశ్రామికవేత్త, లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా. ఇప్పుడు అతడిని దేశానికి రప్పించడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు పారిపోవడానికే అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈ బాధలు ప్రభుత్వానికి తప్పేవి కదా? అని చాలా మంది అభిప్రాయం. అవును... అందుకు మన దేశంలో కఠిన చట్టాలు లేకపోవడమే కారణమని చెప్పకతప్పదు.
ఆడేసుకుంటున్నారు, ఎవరీ దయ అవసరం లేదు: బయటికొచ్చిన మాల్యా
అయితే చైనాలో మాత్రం నేరస్తులు, దోపిడీకి పాల్పడిన వారు మాత్రం శిక్షను తప్పించుకోలేరు. ఈ విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. రుణ ఎగవేతదారులు దేశం నుంచి పారిపోవడానికే కాదు.. అసలు దేశంలోనూ కొన్ని సదుపాయాలు అందకుండా చర్యలు తీసుకుంటోంది చైనా.
చైనాలో సుప్రీం పీపుల్స్ కోర్టు రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని కట్టకుండా తప్పించుకున్న తిరుగుతున్న దాదాపు 60 లక్షలమందికి పైగా పేర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. వారు విమాన, రైలు ప్రయాణాలు చేయకుండా చర్యలు చేపట్టింది. వీటితో పాటు రుణం గానీ, క్రెడిట్ కార్డులు గానీ పొందకుండా ఆంక్షలు విధించిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
60.15 లక్షల మందికి విమానాల్లో ప్రయాణం చేసేందుకు టికెట్ కొనుగోలుపై ఆంక్షలు విధించడం మామూలు విషయం కాదు. మరో 20.22 లక్షల మందికి హైస్పీడ్ రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని కూడా నిలిపివేశారు. రుణ ఎగవేత దారుల ఐడీ కార్డులు, పాస్పోర్టుల ఆధారంగా రైలు, విమాన సంస్థల సహకారంతో వారిపై ఆంక్షలు కొనసాగిస్తున్నామని సుప్రీం పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ తెలిపారు. దీంతో పాటు 71వేల మంది రుణ ఎగవేత దారులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా కొనసాగేందుకు వీలు లేకుండా నిరోధించారు.
అంతేగాక రుణ ఎగవేత దారుల నుంచి క్రెడిట్ కార్డుల కోసం వచ్చిన సుమారు 5.50లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. బ్లాక్లిస్ట్లో ఉన్న వారిలో ప్రభుత్వ అధికారులు మొదలు కొని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఇక్కడ చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉండటం, రాజకీయ నేతల జోక్యం లేకపోవడంతో చైనాలో విజయ్ మాల్యా లాంటి వారికి అవకాశం లేకుండా పోయింది. మన దేశంలో కూడా ఇలాంటి నిబంధనలను కఠినంగా అమలు చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.