చంద్రబాబుకు భారీ షాక్: పోలవరం పనులకు కేంద్రం కొర్రీలు
Recommended Video
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే ఆయన ఆలోచనకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
స్పిల్వే, స్పిల్ చానల్లో కొంత భాగానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది.
గత నెల 6వ తేదీన ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) అధ్యయనం చేసేంత వరకు పనులు నిలిపేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఇప్పటి వరకు రాలేదు...
ఎన్హెచ్పీసీ ఎగువ కాఫర్ డ్యామ్ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు ఇప్పటి వరరకు కూడా రాలేదు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులపై జలవనరుల శాఖ ఇప్పటికే ఆందోళన చెందుతోంది. ఇప్పుడు స్పిల్ వే, చానల్ టెండర్లను నిలిపివేయాలని కేంద్రం ఇంకో షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు ఇది ఊహించని దెబ్బగానే భావించాల్సి ఉంటుంది.
గడ్కరీతో చంద్రబాబు ఇలా...
కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీతో ఈ ఏడాది అక్టోబరు 13న నాగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయింది. పోలవరం కాంక్రీట్ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని, 2018కి గ్రావిటీ ద్వారా 2019కి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పిల్వే, స్పిల్ చానల్లో కొంత భాగానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబు ఈ సమావేశంలో వివరించారు.
గడ్కరీ ఇలా చెప్పారు...
గతంలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ 14 శాతం మైన్సకు టెండర్లను కోట్ చేసినందున ఆ మొత్తానికే తాము పరిమితమవుతామని, కొత్త ధరలను ఆమోదించేది లేదని గడ్కరీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే కాంక్రీట్ పనుల కోసమే టెండర్లను పిలుస్తున్నందున, మైనస్ 14 శాతానికి మించి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు బృందం వివరించింది.
రాయపాటి కాంట్రాక్టుతో...
ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్స్ట్రాయ్తో న్యాయపరమైన, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చునని గడ్కరీ అనుమానాలు వ్యక్తంం చేశారు. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుది కావడంతో అలాంటివేవీ ఎదురు కాబోవని ట్రాన్స్స్ట్రాయ్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుందని చంద్రబాబు చెప్పారు. పనులు జాప్యమవుతున్నందున ప్రధాన కాంట్రాక్టు సంస్థకు 60-సీ నోటీసును కూడా అందజేశామని అన్నారు.
గడ్కరీ చెప్పడంతో...
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏది అవసరమో అది చేయండని చంద్రబాబుతో గడ్కరీ చెప్పడంతో గత నెల 25వ తేదీన గడ్కరీ వద్ద జరిగిన రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు జరిపిన సమావేశం మినిట్స్నూ రాష్ట్రానికి పంపారు. కొత్త టెండర్లకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో చెప్పారు. దాంతో స్పిల్ వే, స్పిల్ చానల్కు సంబంధించి మిగిలిన రూ.1395.30 కోట్ల మేర పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 1వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖ టెండర్లను పిలిచింది. ఈ టెండర్లపై కాంట్రాక్టు సంస్థల నుంచి, ఇతర సంస్థల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు. అయితే, ఈ టెండర్లను ఆపేయాలని ఈ నెల 27వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్కు కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్సింగ్ లేఖ రాశారు.
గడ్కరీ సమావేశం స్ఫూర్తికి భిన్నమా.
పోలవరం ప్రాజెక్టులో మిగిలిన కాంక్రీట్ పనులు రూ.1395 కోట్లకు టెండర్లను పిలిచారని తెలిసిందని, స్పిల్వేలోని బ్లాక్ నంబరు సున్నా నుంచి 35 దాకా అనుబంధ పనులు స్టిల్లింగ్ బేసిన్, ఆప్రాన్, స్పిల్వే మీద బ్రిడ్జికి ఒక టెండరు, స్పిల్ చానల్లో చానల్ నంబరు 356 నుంచి 2920 దాకా మిగిలి పోయిన మట్టి తవ్వకం పనులకు, చానల్ నంబరు 356 నుంచి 1540 దాకా సీసీ బ్లాకు/ లైనింగ్ పనులకు మరో టెండరు పిలిచారని తెలిసిందని ఆ లేఖలో పేర్కొంటూ ఈ ఏడాది అక్టోబరు 13న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశం స్ఫూర్తికి భిన్నంగా ఈ టెండర్లను పిలిచారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఈ లేఖ రాశారు.
గడువు తక్కువ ఇచ్చారు...
టెండర్లను స్వీకరించేందుకు గడువు మూడు వారాలకంటే తక్కువగా ఇచ్చినట్లు తాము గుర్తించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి అన్నారు. అత్యంత విలువైన టెండర్లకు ఇంత తక్కువ సమయం ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. కనీసం 45 రోజులైన గడువైనా ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నాటికి కూడా ఈ-టెండరు నోటీసు ప్రభుత్వ వెబ్సైట్లో కనిపించలేదని తెలిపారు.
టెండర్ల ప్రక్రియ సరి కాదు...
పై అంశాల దృష్ట్యాటెండరు ప్రకియను కొనసాగించడం సమంజసం కాదని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆ టెండర్లను ఆపేయాలని ఆదేశించారు. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. ఈ స్థితిలో జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు.