పూరి చుట్టే!: ఎవరా ముగ్గురు వ్యాపారవేత్తలు.. చిన్నాకు 25ప్రశ్నలు
ఈ ముగ్గురు వ్యాపారవేత్తలకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగానే ఉంచుతున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులంతా సిట్ ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. సినీ వర్గాలతో పాటు వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ వ్యవహారంలో వెలుగుచూస్తుండటంతో.. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పూరీకి చిన్నా డ్రగ్ కొరియరా?: సిట్ ప్రశ్నించింది పూరీతో సంబంధాలపైనే!
మరోవైపు మంగళవారం సిట్ ముందు హాజరైన చిన్నాను పూరితో సంబంధాల గురించే ఎక్కువగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పూరి ద్వారానే డ్రగ్స్ అలవాటయ్యాయా?.. కెల్విన్ తో ఎలాంటి సంబంధాలున్నాయి? వంటి ప్రశ్నల పైనే సిట్ అధికారులు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ఎవరా ముగ్గురు?:
హైదరాబాద్కు చెందిన బానోత్ సౌరభ్, ఆకుల రిషితేష్, అంకిత్ అగర్వాల్ అనే ముగ్గురు వ్యాపారవేత్తలు మంగళవారం సిట్ ముందు హాజరయ్యారు. చిన్నాను విచారిస్తున్న సమయంలోనే ఆ ముగ్గురిని పిలిపించడంతో.. ఈ వ్యవహారంలో వారి పాత్రపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
ఏ ప్రాంతం వారు?:
సిట్ ముందుకు రావడమైతే వచ్చారు గానీ ఆ ముగ్గురు వ్యాపారవేత్తలు ఎక్కడివారు, అసలు డ్రగ్స్ కేసుతో వారికేం సంబంధం? వంటి విషయాలు మాత్రం ఇంతదాకా బయటకు రాలేదు. అయితే అధికారులు వారిని విచారణకు పిలిపించారంటే.. డ్రగ్స్ వ్యవహారంలో వీరికి కూడా లింకులు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోప్యంగా వివరాలు:
ఈ ముగ్గురు వ్యాపారవేత్తలకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగానే ఉంచుతున్నారు. దీనిపై స్పందించాల్సిందిగా సిట్ మీడియా లైజనింగ్ అధికారులను కోరినా.. తమ వద్ద వారి పేర్లు తప్ప ఇతర వివరాలేవి లేవని పేర్కొనడం గమనార్హం.
అయితే బయటకు వస్తున్న లీకులు మాత్రం పలు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. విచారణకు హాజరైన ముగ్గురు వ్యాపారవేత్తల్లో ఒకరు ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల సంస్థను నిర్వహిస్తుండగా.. మరొకరు దాన్ని అడ్డుపెట్టుకుని డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లుగా లీకులు వస్తున్నాయి.
చిన్నాకు 25ప్రశ్నలు:
మంగళవారం నాడు చిన్నాను విచారించిన సిట్ అధికారులు.. మొత్తం 25ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పూరి ద్వారానే చిన్నాకు డ్రగ్స్ అలవాటయ్యాయి అన్న ఊహాగానాలు ఉండటంతో.. ఆ విషయాన్ని విచారణలో అధికారులు ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే పూరితో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే అలాంటి ప్రచారం జరిగింది తప్ప అందులో ఎలాంటి నిజం లేదని చిన్నా అంగీకరించినట్లు సమాచారం. కావాలంటే తన బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక కెల్విన్ తనకొక ఈవెంట్ మేనేజర్ గానే తెలుసనని, పలుమార్లు ఫోన్ లో మాట్లాడానని చెప్పినట్లు తెలుస్తోంది.