16 దాటితే పెద్దలే: చట్టమొస్తే ఏం జరుగుతుంది?
న్యూఢిల్లీ: అత్యాచారం, క్రూరమైన నేరాల కేసుల్లో బాలలుగా పరిగణించే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే బాలల న్యాయ చట్టం (చిన్నారుల సంరక్షణ, భద్రత) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. పార్లమెంట్ బయటా, లోపలా అందరూ డిమాండ్ చేసిన ఈ బిల్లును రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
ఇంతకీ ఈ బిల్లులో ఏముంది? దీని వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ప్రస్తుతం బాలల న్యాయ చట్ట ప్రకారం అత్యాచారం, క్రూరమైన నేరాల కేసుల్లో మరణశిక్ష విధించే అవకాశమున్న సాధారణ చట్టాల కింద బాలలపై విచారణ చేపట్టడానికి వీల్లేకుండా పోయింది. అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినా బాల న్యాయ బోర్డు మాత్రమే విచారణ చేపట్టాల్సి ఉంటుంది.
మాడేళ్లకు మించి శిక్షకూడా వేసే అవకాశం లేదు. తాజా బిల్లు సవరణలో అత్యాచారం, క్రూరమైన నేరాల కేసుల తీర్పుల విషయంలో బాల నేరస్తుల ప్రామాణిక వయస్సు 16గా ఉండనుంది. వయసును తగ్గించడం ద్వారా 16 ఏళ్లకు పైబడిన వారు బాలల న్యాయ చట్టం కింద ఇకపై రక్షణ పొందలేరు.
ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో పెండింగ్ ఉండగా, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ ఈ బిల్లును చర్చకు చేపట్టింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 16 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన వారు చేస్తున్న నేరాలు దేశంలో పెరుగుతున్నాయంటూ గణాంకాలతో సహా ఈ సందర్భంగా ఆమె వివరించారు.
ప్రస్తుత చట్ట సవరణతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, దేశంలో నేర నియంత్రణకు ఈ సవరణ ఉపయోగపడుతుందని మేనకా గాంధీ అన్నారు. ఈ బిల్లు ఎంత మాత్రమూ బాలల రక్షణకు వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ బిల్లును నిర్భయ కేసును విచారించిన ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో చర్చించి మరీ తాను రూపొందించానని మంత్రి వెల్లడించారు.
కొత్త బిల్లులో ఏముంది..?
* అత్యాచారం, హత్య వంటి అత్యంత క్రూర నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల వయస్సు 16-18 మధ్య ఉన్నప్పటికీ, మేజిస్ర్టేట్ నేతృత్వంలోని జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతితో ఈ నిందితులను పెద్దలగానే పరిగణిస్తారు. దీంతో వీరికి ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
* ప్రతి జిల్లాలోనూ జువెనైల్ జస్టిస్ బోర్డులు, బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలోనూ కనీసం ఒక్కరైనా మహిళా సభ్యురాలు ఉంటారు.
* జువనైల్ జస్టిస్ బోర్డులో ఒక జ్యుడీషియల్ మేజిస్ర్టేట్, ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఒకవేళ విచారణకు వ్యతిరేకంగా బోర్డు నిర్ణయం తీసుకుంటే బాల నేరస్థులను పునరావాస కేంద్రానికి పంపుతారు.
* ఆయా జిల్లాల్లోని చిన్నారుల వ్యవస్థీకృత సంరక్షణ బాధ్యత ఆ జిల్లాల్లోని బాలల సంక్షేమ కమిటీలదే. ప్రతి కమిటీలో ఒక చైర్పర్సన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వీరంతా బాలలకు సంబంధించిన విషయాల్లో నిపుణులు.
* బాలలు నేరాలకు పాల్పడితే, వారి ప్రయోజనాలు, పునరావాస విషయాలను దృష్టిలో పెట్టుకుని కేసులను పరిష్కరించేలా ఈ బిల్లును రూపొందించారు.
* 18 ఏళ్లలోపు బాలలందరూ సమానమేనని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ దిశగా బాలల హక్కుల కోసం నిర్వహించిన సదస్సులో భారత్ కూడా సంతకం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జువెనైల్ జస్టిస్ బిల్లు ఐరాస లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
* రాజ్యాంగంలోని ఆర్టికల్-14 (సమానత్వ హక్కు)కు, ఆర్టికల్-21(జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమనీ విమర్శకులు అంటున్నారు. పైగా, బిల్లులో ప్రతిపాదించిన కొన్ని శిక్షలు, ఆయా నేరాల తీవ్రతకు మధ్య పొంతన లేదనీ వీరు అంటున్నారు.
* బాలలను దత్తత తీసుకోవడం, దత్తత తీసుకోవాలనుకునే వారికి ఉండాల్సిన అర్హతలను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు.