రజనీకాంత్ డైలమా: కమల్ హాసన్ ఎంట్రీ?
తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ నోరు మెదపడం లేదు. ఆ స్థితిలో కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేస్తారనే ప్రవేశం జరుగుతోంది. ఎందుకు...
చెన్నై: తమిళనాడు రాజకీయాలు పెను మార్పునకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తమిళ నటీనటులు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. వివిధ సమస్యలపై స్పందిస్తున్నారు. జల్లికట్టులాంటి సమస్యలపై ముందుండి ఉద్యమం నడిపిస్తున్నారు. ఈ స్థితిలో వారు రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
తాజాగా కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో అటువంటి ఉహాగానాలు ఎప్పటికప్పుడు చెలరేగుతూనే ఉన్నాయి. కానీ ఆయన పెదవి విప్పడం లేదు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయని ప్రచారం సాగుతోంది.
ఆదివారంనాడు కమల్ హాసన్ చెన్నైలోని అళ్వారుపేటలో గల తన కార్యాలయంలో అభిమాన సంఘాల నాయకులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. వారు ఆయన సలహాలు, సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారనే విషయం తెలిసిపోతుంది.
జల్లికట్టు ఉద్యమానికి మద్దతు...
రాష్ట్రంలో సాగిన జల్లికట్టు ఉద్యమానికి కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కూడా బలంగా తన గొంతును వినిపించారు. జల్లికట్టును నిషేధించడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సంప్రాదాయం తెలియకుండా ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన జల్లికట్టును నిషేధించడానికి ప్రయత్నించడం కాదని, మీకు దమ్ముంటే డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికాలో జరిగే రోడియో బుల్ రైడింగ్ (ఎద్దు స్వారీ)ని నిషేధించాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేటా సంస్థకు చాలెంజ్ చేశారు. పేటా సంస్థ కేవలం భారతదేశంలోనే జంతుహక్కుల కోసం పోరాటం చేస్తున్నదని, ప్రపంచంలో మరెక్కడా జంతువులు లేవా ? వాటి హక్కుల కోసం పోరాటం చెయ్యడం మీ బాధ్యత కాదా ? అని కమల్ హాసన్ పేటా సంస్థను ప్రశ్నించారు.
వీటిని బ్యాన్ చేస్తారా....
ఏవో దారుణాలు జరిగిపోతాయని ఆరోపిస్తూ జల్లికట్టు సాహస క్రీడను నిషేధించడం సరైంది కాదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజలను గౌరవించాలని ఆయన మనవి చేశారు. ఎద్దులను హింసిస్తున్నారని, ఎద్దులు పొడవడంతో యువకులు మరణిస్తున్నారని ఆరోపిస్తూ జల్లికట్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణంగా ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మనకు అందరికీ తెలుసు అని కమల్ హాసన్ గుర్తు చేశారు. అయితే కారు, బైక్ రేసులు నిషేధించారా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ విషయం మీకందరికీ తెలుసుకదా అని కమల్ హాసన్ మీడియాతో అన్నారు. అయితే ఎన్ని రాష్ట్రాల్లో కారు, బైక్ రేసులు నిషేధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుపై అభ్యంతరాలు చెప్పడం కాదని, ప్రమాదాలకు కారణం అయ్యే కారు, బైక్ రేసులు నిషేధించాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు.
కావేరీ జలాలపై కూడా కమల్...
కావేరీ జలాల పంపిణీ విషయంలో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య రేగిన ఘర్షణపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. నదీ జలాల కోసం ఘర్షణ పడడం సిగ్గుచేటైన విషయంగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన గతంలో తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 'మనం భాష తెలియని వానరాలుగా ఉన్నప్పుడూ కావేరీ ప్రవహించింది. మానవుడిగా మారి నాగరికత నేర్చుకున్న తర్వాత కూడా ప్రవహిస్తూనే ఉంది. మనతరం ముగిసిన తర్వాత కూడా అది అలానే ప్రవహిస్తుంది. జరిగిన చరిత్రను ఆ నది చెబుతుంటే మనం మాత్రం ఘర్షణలకు పాల్పడడం సిగ్గుచేటు' అని ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
జయలలితపై కమల్ ఇలా...
దోషిగా తేలిన శశికళ, ఆమె కుటుంబసభ్యులు కలిసి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారని, ఆదో నేరస్తుల గుంపు అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. దివంగత సీఎం జయపై కూడా నేరారోపణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశ్వరూపం వివాదం నాటి పరిస్థితులను కమల్ ఇంకా మరిచిపోలేకనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జయలలిత తీరు పట్ల అప్పట్లో కమల్ హాసన్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
స్వామిపై కమల్ హాసన్ ఇలా..
తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రముఖ నటుడు కమల్ హాసన్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మధ్యలో పచ్చగడ్డి వేస్తే మండే పరిస్థితి నెలకొంది. కమల్ను విమర్శిస్తూ స్వామి ట్వీట్ చేసిన మరు క్షణంలోనే కమల్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. ఓ ట్విట్టర్ ఖాతాదారుడు సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నిస్తూ.. కమల్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాన్ని బీజేపీ ఆహ్వానిస్తుందా? అని అడగగా... బీజేపీ సంగతి తెలియదు గానీ, తాను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పారు. 'బోన్లెస్ వండర్, డంబాలకు పోయే ఇడియట్ కమల్' అంటూ ట్వీట్ చేశారు సుబ్రమణ్య స్వామి. దీంతో చిర్రెత్తుకొచ్చిన కమల్.. వెంటనే అదే స్థాయిలో ట్వీట్ చేశారు. తనకు ఒక అంశంపై మొండిగా పోరాడే తత్వం ఉందని, అది మాత్రం చాలు అని చెప్పారు. అంతేగాక, 'సంతోషం.. సుబ్రహ్మణ్యస్వామి తమిళులను ఎలా పిలుస్తారో ఆయనకు తెలుసు. నేనెప్పుడు ఆయనను వ్యతిరేకించను.. ప్రజలే ఆ పనిచేస్తారు. స్వామి ఓ కరడు వ్యక్తిత్వం ఉన్నవ్యక్తి. ఆయనకు నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ కమల్ ఒక వైపు చురకంటించారు.
పళనిసామి విశ్వాస పరీక్షపై
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తమిళనాడుకు మరో ముఖ్యమంత్రి వచ్చేలా ఉన్నారని కమల్ ట్విట్టర్ ద్వారా అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పన్నీరు సెల్వంకు కమల్ హాసన్ పరోక్షంగా మద్దతు పలికారు. బలపరీక్ష, జరిగిన తీరుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బలపరీక్షపై గవర్నర్కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని కోరారు. ఈ మెయిళ్ల ద్వారా హుందా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచిస్తూ గవర్నర్ ఈమెయిల్ ఐడి ([email protected])ని ట్వీట్ చేశారు.
శశికళపై ఆయన ఇలా.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది నిమిషాల్లో తీర్పు వెలువరిస్తుందనగా కమల్ తన వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. "మెరీనా ఆత్మ తీర్పు కోసం మౌనంగా ఎదురు చూస్తోంది" అని ట్వీట్ చేశాడు. వారు (మెరీనా ఆత్మ) ఎప్పుడూ కోర్టు తీర్పులను గౌరవించారని, ఇకపైనా అదే కొనసాగిస్తారని అన్నారు. "కోర్టులు తమ విధులు తాము నిర్వర్తిస్తాయి. ప్రజలు కూడా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. జయలలిత సమాధి మెరీనా బీచ్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. కమల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
పన్నీరు సెల్వంకు మద్దతు
శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత కమల్ హసన్ ప్రశంసలు గుప్పించారు.అధికారం చేపట్టడంపై రెండు రకాల అభిప్రాయాలనుఆయన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ రెండు సూక్తులను కూడ ఆయన ఉటంకించారు. "శిక్ష పడుతోందనే భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్గడం...మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో) " అని ఆయన ట్వీట్ చేశారు. "ఖచ్ఛితంగా తమిళనాడులో ఇదే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. " కమల్ హసన్ అభిప్రాయాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
రజనీకి కమల్ సూచన...
విలక్షణ నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు రాజకీయాల విషయంలో ఓ సూచన చేసినట్లుగా నిరుడు ఏప్రిల్లో వార్తలు వచ్చాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కమల్ హాసన్ పిలుపునిచ్చినట్లుగా ఆ వార్తలు చెప్పాయి. మంచివారు రాజకీయాలకు దూరంగా ఉండరాదని కమల్ హాసన్ సూచించారు. అయితే ఆ సమయంలో కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు.
అందుకేనా కమల్ హాసన్ ఇలా...
రాజకీయాల్లోకి రావడంపై రజనీకాంత్ డైలమాలో ఉన్న నేపథ్యంలోనే కమల్ హాసన్ యాక్టివ్ అయ్యారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయడం లేదు. చాలా కాలంగా ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రచారం సాగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదు. ఆయన అంతరంగం ఏమిటో కూడా తెలియడం లేదు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు.